గర్భిణుల కష్టాలు తీరేదెన్నడు ?

ABN , First Publish Date - 2020-07-13T11:03:51+05:30 IST

వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి.

గర్భిణుల కష్టాలు తీరేదెన్నడు ?

వర్షాకాలంలో ఏజెన్సీవాసులకు తప్పని ఇబ్బందులు

ఏర్లు, వాగులు పొంగి స్తంభిస్తున్న రాకపోకలు

గోదావరి పరీవాహక ప్రాంతంలో 75 మంది గర్భిణుల గుర్తింపు


భద్రాచలం, జూలై 12: వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. ముఖ్యంగా వర్షాలు, వరదల సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని మారుమూల మండలాల్లో నివసిస్తున్న గర్భిణుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటాయి. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో గిరిజన ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని పది పీహెచ్‌సీల పరిధిలో రాబోయే మూడు నెలల్లో  75 మంది గర్భిణులు ప్రసవించనున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఇప్పటికే వారిని అప్రమత్తం చేశారు. 


ఏటా తప్పని తిప్పలు 

ఏజెన్సీ ప్రాంతాల్లో వరదలొస్తే పలు గ్రామాలకు మండల కేంద్రాలకు రాకపోకలు స్తంభిస్తాయి.  రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. చర్ల,  అశ్వాపురం, దుమ్ముగూడెం తదితర మండలాల్లో వర్షాకాలంలో గర్బిణీలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. చర్ల మండలంలో బోదనెల్లి, చింతగుప్ప, బత్తెనపల్లి తదితర గ్రామాల్లో వాగులు పొంగితే ఎగువ గ్రామాల్లోని వారికి రాకపోకలు స్తంభిస్తాయి. దుమ్ముగూడెం మండలంలోనూ  ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గతంలో కుర్నపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ ప్రసవ సమయంలో వాగులు పొంగడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమెను సత్యనారాయణపురం పీహెచ్‌సీకి 108 వైద్య సిబ్బంది ఎంతో కష్టపడి తీసుకురావాల్సి వచ్చింది.


ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

ప్రసవం కోసం సిద్దంగా ఉన్న గర్భిణులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే  గుర్తించింది. అయితే గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరువ కావడంతోనే ముందస్తుగా గుర్తించిన గర్భిణులను సమీపంలోని వైద్యశాలలకు, ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తేనే వారు ప్రమాదం నుంచి బయటపడతారు.  


Updated Date - 2020-07-13T11:03:51+05:30 IST