కరోనాతో కన్నుమూసిన మహిళా డాక్టర్... చివరి సందేశం వీడియో వైరల్!
ABN , First Publish Date - 2021-05-12T15:58:10+05:30 IST
కరోనావైరస్ ప్రపంచంలో లక్షలాది మందిని హతమార్చింది.
న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచంలో లక్షలాది మందిని హతమార్చింది. ప్రపంచంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కరోనా బాధితులను కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్లో దేశంలో పరిస్థితి మరింత దిగజారింది. అయినప్పటికీ కొందరు కరోనా విషయంలో తమ నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక వైద్యురాలు కరోనాను తేలికగా తీసుకోకూడదంటూ అందించిన సందేశం ఇప్పుడు వైరల్గా మారింది.
ఢిల్లీకి చెందిన డాక్టర్ దీపికా అరోరా చావ్లా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళే ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు. కరోనాను తేలికగా తీసుకోకూడదని, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలని, సామాజిక దూరాన్ని తప్పక పాటించాలని ఆమె కోరారు. ఏప్రిల్ 11 న డాక్టర్ దీపిక కరోనా బారిన పడగా, ఏప్రిల్ 26 న ఆమె కన్నుమూశారు. తన భార్య అందించిన చివరి వీడియోను భర్త రవీష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరోనా విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో కొట్టుమిట్టడుతున్న సమయంలో తన భార్య తన గురించి, తమ మూడేళ్ల కుమారుని గురించి తపించిపోయారన్నారు. అలాగే ఆమె కడుపులో ఉన్న శిశువు గురించి కూడా వేదన చెందారన్నారు. కాగా భార్యను, పుట్టబోయే బిడ్డను కోల్పోయిన రవీష్... మరెవరికీ ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటూ ఆమె చివరి వీడియోను సోషల్ మీడియలో షేర్ చేశారు.
షాన్ పంజాబీ మీడియా సౌజన్యంతో....