ఏనుగు పోస్ట్మార్టం రిపోర్ట్లో దయనీయ విషయం వెలుగులోకి..
ABN , First Publish Date - 2020-06-05T17:59:31+05:30 IST
పేలుడు పదార్థాలున్న పండును తినిపించి కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగును చంపేసిన ఘటనలో...
మలప్పురం: పేలుడు పదార్థాలున్న పండును తినిపించి కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగును చంపేసిన ఘటనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఏనుగు కళేబరానికి పశువైద్యులు జరిపిన పోస్టుమార్టం నివేదిక తాజాగా వెల్లడైంది. ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో దయనీయ విషయాలు వెలుగులోకొచ్చాయి. మరణించిన ఆ ఏనుగు రెండు వారాల ముందు నుంచి ఏమీ తినలేదని, తాగలేదని పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. పేలుడు పదార్థాల వల్ల ఏనుగు నోటి భాగం తీవ్రంగా గాయపడిందని, ఆహారం తీసుకోలేక పోయిందని తెలిసింది.
ఆ ఏనుగు నీళ్లలో మునగడం వల్ల, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. గాయపడిన తర్వాత ఏనుగు ఎక్కువ సేపు బతకపోవడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కేరళ ప్రభుత్వం నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది.