లాక్‌డౌన్ ఎఫెక్ట్: 100 కిలోమీటర్లు నడిచి వెళ్లిన నిండు గర్భిణి

ABN , First Publish Date - 2020-03-30T20:17:30+05:30 IST

లాక్‌డౌన్ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సామాన్యుల దయనీయ గాథలు సభ్య సమాజాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి...

లాక్‌డౌన్ ఎఫెక్ట్: 100 కిలోమీటర్లు నడిచి వెళ్లిన నిండు గర్భిణి

మీరట్: లాక్‌డౌన్ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సామాన్యుల దయనీయ గాథలు సభ్య సమాజాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. యూపీలోని సహరాన్పూర్‌లో ఓ యజమాని ఉన్నట్టుండి పనిలో నుంచి తీసేయడంతో.. ఎనిమిది నెలల నిండు గర్భిణి, ఆమె భర్త దిక్కుతోచని స్థితిలో పడ్డారు. యజమాని కనీసం తమకు రావాల్సిన జీతం కూడా ఇవ్వకపోవడంతో దంపతులిద్దరూ కాలినడకన స్వగ్రామానికి బయల్దేరారు. దాదాపు 100 కిలోమీటర్లు నడిచిన తర్వాత మీరట్‌లో వీరి గురించి తెలిసి స్థానికులు చలించిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్‌హెచ్‌వో అశుతోష్ కుమార్ హుటాహుటిన వీరికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు. బులంద్షహర్ జిల్లా అమర్‌గఢ్‌కు చెందిన వీరిద్దరినీ యస్మీన్, వకిల్‌గా గుర్తించారు.


భర్తతో కలిసి రెండు రోజులుగా కాలినడక వచ్చిన యస్మీన్ మీరట్‌కు చేరుకున్నాక తీవ్రంగా నీరసించిపోయింది. నడిచేపరిస్థితి లేకపోవడంతో వకిల్ ఆమెను తీసుకుని సోహ్రాబ్‌ బస్టాండ్ వద్దకు వెళ్లాడు. ఇంతలో వీరిని గమనించిన స్థానికులు నవీన్ కుమార్, రవీంద్ర వెంటనే నౌచండి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారికి ఆహారం అందించడంతో పాటు కొంత డబ్బులు కూడా సమకూర్చారు. పోలీసులు ఓ అంబులెన్స్ ఏర్పాటు చేసి క్షేమంగా గ్రామానికి తరలించారు. 

Updated Date - 2020-03-30T20:17:30+05:30 IST