వైద్యం అందక నిండు గర్భిణి మృతి!
ABN , First Publish Date - 2021-08-02T07:39:31+05:30 IST
వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి ఉసురు తీసింది. కడుపులో బిడ్డ మృతి చెంది పరిస్థితి విషమించిన..
కరోనా ఉందని ఆస్పత్రిలో చేర్చుకోని వైద్యులు
ఆస్పత్రులు తిరిగి తిరిగి రోడ్డుపైనే మృతి
ములకలపల్లి, ఆగష్టు 1: వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి ఉసురు తీసింది. కడుపులో బిడ్డ మృతి చెంది పరిస్థితి విషమించిన వేళ.. కరోనా ఉందంటూ ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో.. ఆ నిండు గర్భిణి నడిరోడ్డుపై ప్రాణం విడిచింది. ఈ విషాధ ఘటన.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగింది. సీతాయిగూడెం పరిధిలోని గండిప్రోలు గ్రామానికి చెందిన వంక సుజాత(26) నిండు గర్భిణి. ఆకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో.. భర్త ప్రసాద్.. సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు. కడుపులో బిడ్డ చనిపోయిందని గుర్తించిన అక్కడి వైద్యులు.. ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సుజాతకు కరోనా పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో.. ప్రసాద్.. ఆమెను మరికొన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అన్ని చోట్లా నిరాకరణే ఎదురైంది. ఈ క్రమంలో.. ఆమె నడిరోడ్డుపై.. వాహనంలోనే ప్రాణాలు విడిచింది.