ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట ఆస్పత్రికి

ABN , First Publish Date - 2021-07-30T05:40:13+05:30 IST

తంబళ్లపల్లె మండలానికి చెందిన ఓ ప్రేమజంట బుధవారం రాత్రి అనంతపురం జిల్లా కదిరిలో ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.

ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట ఆస్పత్రికి
ఆస్పత్రిలో కోలుకుంటున్న మహేష్‌

మదనపల్లె వైద్యశాలలో కోలుకుంటున్న బాధితులు

మదనపల్లె క్రైం, జూలై 29: తంబళ్లపల్లె మండలానికి చెందిన ఓ ప్రేమజంట బుధవారం రాత్రి అనంతపురం జిల్లా కదిరిలో  ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు తీసుకున్న సెల్ఫీవీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు వారి కోసం గాలించారు. ఆత్మహత్యకు యత్నించిన ప్రేమ జంట ప్రస్తుతం మదనపల్లె  వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. డీఎస్పీ రవిమనోహరాచారి కథనం మేరకు వివరాలు..  కొటాల పంచాయతీ పెద్దబోయపల్లెకు చెందిన నరసింహులు కుమారుడు మహేష్‌(22) టెంపోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(17) ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ఈ నేపథ్యంలో మహేష్‌, సమీప బంధువైన బాలిక మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అడ్డుచెప్పడంతో మార్చిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. తమిళనాడుకెళ్లి అక్కడ ఓ ఇంట్లో పని చేస్తుండేవారు. కాగా బాలిక  మైనర్‌ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె పోలీసులు అదృశ్యం కేసునమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా మహేష్‌, బాలిక ఇటీవల తమిళనాడులోని ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. ఎలాగైనా స్వగ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వెళ్తే..పోలీసులు, పెద్దలు కలసి విడదీస్తారని భయపడి అక్కడే ఉంటున్నారు. బుధవారం ధైర్యం చేసి తమిళనాడు నుంచి కదిరికి వచ్చారు. అక్కడ చనిపోవాలని నిర్ణయించుకుని బస్టాండు సమీపంలో కూల్‌డ్రింక్‌లో గుళికమందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆ సమయంలో వారు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అటు కదిరి, ఇటు తంబళ్లపల్లె పోలీసులు ప్రేమజంట ఆచూకీ కోసం గాలించారు. వారు ఎవరి కంటా పడకుండా కదిరిలో బస్సెక్కి రాత్రి 11 గంటలకు ములకలచెరువులో దిగారు. నేరుగా సర్కిల్‌ కార్యాలయానికెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో పోలీసులు ప్రేమజంటను చికిత్సనిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించి మదనపల్లె వైద్యశాలకు రెఫర్‌ చేశారు. ఆస్పత్రి వైద్యులు బాధితులకు మెరుగైన వైద్యం అందించి వార్డుకు తరలించారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న ఇద్దరి కుటుంబీకులు, బంధువులు రాత్రికిరాత్రే ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. దీన్నిబట్టి ఇద్దరి కుటుంబాలు రాజీవెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రేమజంట ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.


Updated Date - 2021-07-30T05:40:13+05:30 IST