సేమ్‌ టు సేమ్‌!

ABN , First Publish Date - 2021-06-10T07:53:25+05:30 IST

ఆనందయ్య మందు నాయకుల కనుసన్నలు దాటి బయటకు రాలేదు. కానీ అదే మందు మేమూ తయారు చేస్తున్నామంటూ పలువురు మార్కెట్లోకి ప్రవేశించారు

సేమ్‌ టు సేమ్‌!

‘ఆనందయ్య మందు’ పేరిట జోరుగా తయారీ

నెల్లూరులోనే పదుల సంఖ్యలో తయారీ కేంద్రాలు

కొన్నిచోట్ల ఉచితం.. ఇంకొన్ని చోట్ల విక్రయాలు

ఒక్కో డబ్బా వెయ్యి నుంచి 2 వేల రూపాయలు

మోసపోతున్న సామాన్య ప్రజానీకం


(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)

ఆనందయ్య మందు నాయకుల కనుసన్నలు దాటి బయటకు రాలేదు. కానీ అదే మందు మేమూ తయారు చేస్తున్నామంటూ పలువురు మార్కెట్లోకి ప్రవేశించారు. ఆయుర్వేద మందుల తయారీకి ఆనందయ్య వినియోగించే వస్తువులు, మూలికల వివరాలు ఇప్పటికే బహిరంగం కావడంతో వాటి ఆధారంగా ఎవరికి వారు మందులు తయారు చేసి పంచిపెడుతున్నారు. కొందరు అమ్ముకొంటున్నారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ చేస్తే తరలివచ్చే ప్రజలను కట్టడి చేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో ‘ఆనందయ్య మందును మేమే డీ సెంట్రలైజ్డ్‌ పద్ధతిలో అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తాం’ అని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నాలు జరగలేదు. మందు పంపిణీ కోసం యంత్రాంగం సహకారం కోరుతూ ఆనందయ్య ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు రాసిన లేఖలకు స్పందన లేదు. ఆనందయ్యకూ అధికార పార్టీ నాయకుల నుంచి ఇంకా స్వేచ్ఛ లభించలేదు. గత ఐదు రోజులుగా తయారు చేసిన మందులను సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటా పంచారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన మరో అధికార పార్టీ ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆయన నియోజకవర్గమంతా సరిపడా మందు తయారుచేసే వరకు ఆనందయ్యకు విశ్రాంతి దొరక్కపోవచ్చు. మందు తయారీకి హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులిచ్చి పది రోజులు దాటుతున్నా, నిజంగా మందు అవసరం ఉన్న యాక్టివ్‌ కేసులకు ఆ మందు అందడంలేదు.  దీంతో మార్కెట్‌లోకి ఆనందయ్య మందు పేరుతో పలువురు వ్యక్తులు ప్రవేశించారు. 


కాసింత పరిజ్ఞానం ఉన్నా..

మందుల తయారీకి ఏ ఏ పదార్థాలు, మూలికలు వాడతారో, ఏవిధంగా తయారు చేస్తారో ఇదివరకే ఆనందయ్య అధికారులకు వివరించడం, ఆ వివరాలు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియడంతో కొంతమంది ‘ఆనందయ్య మందు’ తయారు చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నాయకులు ఆనందయ్య ద్వారా రహస్యంగా మందులు తయారు చేయించుకున్న సందర్భంగా క్యాటరింగ్‌ సిబ్బందిని సహాయకులుగా వినియోగించారు. మందు తయారీని ప్రత్యక్షంగా చూసిన వీరిలో కొందరు ఇప్పుడు సొంత వ్యాపారం పెట్టుకున్నారు. సొంతంగా మందు తయారు చేసి, డబ్బాల్లో ప్యాక్‌ చేసి కావాల్సిన వారికి ఇస్తున్నారు. కొంతమంది ఉచితంగా పంచి పెడుతుండగా, మరి కొంతమంది రూ.వెయ్యి, రెండు వేలకు అమ్ముకొంటున్నారు. నెల్లూరు నగరంలోనే ఇలాంటి వారు పదుల సంఖ్యలో తయారయ్యారు. ఆయుర్వేదంలో కాసింత పరిజ్ఞానం ఉన్న పలువురు మండలాలను కేంద్రాలుగా చేసుకొని ఆనందయ్య మందు అంటూ సొంత మందును విక్రయించుకొంటున్నారు. ఈ మందు తయారీలో వాడే పదార్థాలేవీ హానికరం కావు కాబట్టి, ఎలా చేసినా వాటిని తిన్నవారికి ఏమీ కాదన్న ధైర్యంతో కొంతమంది దొరికిన ఆకులు అలుములు వేసి లేహ్యాలు తయారు చేసి, అందులో కాసింత తేనె కలిపి చిన్న చిన్న ప్లాస్టిక్‌ డబ్బాల్లో వేసి జనాలకు ఇస్తున్నారు. ఇది నిజంగా ఆనందయ్య తయారు చేసిన మందుగా భావించి మోసపోతున్నారు.


అనంతలో ఆనందయ్య మందు

ఇంటింటికీ పంపిణీ చేసిన గోవిందానంద సరస్వతి స్వామి


అనంతపురం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన మందును కర్ణాటక రాష్ట్రం హంపికి చెందిన గోవిందానంద సరస్వతి స్వామి అనంతపురం నగరంలో ఇంటింటికీ పంపిణీ చేశారు. గోవిందానందతో పాటు ఆయన శిష్య బృందం ఆనందయ్య మందును అనంతపురం మీదుగా కర్ణాటకకు తీసుకెళ్తున్నారు. అనంతపురంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలియడంతో ముందుగా అనంతపురంలోనే పంపిణీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ మేరకు నగరంలోని 1వ రోడ్డులో ఉన్న శివాలయానికి గోవిందానంద బృందం చేరుకుంది. 44వ డివిజన్‌లోని 500 కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి మందు పంపిణీ చేశారు. గోవిందానంద మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య మందు నెల్లూరు జిల్లా దాటి బయటకు రావడం లేదని, అందుకేతాము తమ రాష్ర్టానికి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఆనందయ్య ఫార్ములాతో కరోనా మందు తయారు చేసేందుకు చాలామంది కష్టపడుతున్నారని, వారందరికీ ప్రభుత్వం తోడ్పాటు అందించాలని స్వామి సూచించారు. 

Updated Date - 2021-06-10T07:53:25+05:30 IST