హరితహారానికి మొక్కలు సిద్ధం చేయండి
ABN , First Publish Date - 2021-06-22T07:19:52+05:30 IST
రానున్న హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ హెమంత్ బోర్కాడే అన్నారు.
అదనపు కలెక్టర్ హెమంత్ బోర్కాడే
కుభీర్, జూన్ 21 : రానున్న హరితహారం కార్యక్రమం విజయవంతం చేసేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ హెమంత్ బోర్కాడే అన్నారు. సోమవారం మండలంలోని పార్డి(బి) గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుధ్య వ్యవస్థను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా మురికి కాలువలను శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. రోడ్డు వెంబడ నాటిన మొక్కలకు కంచె ఏర్పాటు చేయాలని కార్యదర్శికి సూచించారు. కరోనావైరస్ సోకకుండా గ్రామస్థులకు అవగాహన కల్పించి, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులను ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈయన వెంట ఎంపీడీవో శేఖర్, ఎంపీవో గోవర్ధన్, నాయకులు తూం రాజేశ్వర్, పాలక వర్గ సభ్యులు, తదితరులు ఉన్నారు.