భారత్కు బాసటగా యూఎస్ డిఫెన్స్ ఫోర్స్..
ABN , First Publish Date - 2021-05-14T19:59:30+05:30 IST
కరోనాతో పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు తమవంతు సహాయం చేస్తూ కష్ట సమయంలో ఆదుకుంటున్నాయి. అటు అగ్రరాజ్యం అమెరికా, అక్కడి పలు కార్పొరేట్ సంస్థలు, భారతీయ అమెరికన్లు కూడా భారీగా సాయం చేస్తూ ఆపన్న హస్తం అందిస్తున్నారు.
వాషింగ్టన్: కరోనాతో పోరాడుతున్న భారత్కు ప్రపంచ దేశాలు తమవంతు సహాయం చేస్తూ కష్ట సమయంలో ఆదుకుంటున్నాయి. అటు అగ్రరాజ్యం అమెరికా, అక్కడి పలు కార్పొరేట్ సంస్థలు, భారతీయ అమెరికన్లు కూడా భారీగా సాయం చేస్తూ ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా ఆ దేశానికి చెందిన డిఫెన్స్ ఫోర్స్ భారత్కు బాసటగా నిలిచింది. ప్రాణవాయువు కొరతతో సతమతం అవుతున్న భారత్కు 159 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిస్తున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. వచ్చే సోమవారం ప్రత్యేక కమర్షియల్ విమానంలో వీటిని భారత్కు తరలించనున్నట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ.. "ట్రావిస్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద డిఫెన్స్ లాజిస్టిక్స్ ఏజెన్సీ 159 ఆక్సిజన్ కాన్నంట్రేటర్లను భారత్కు పంపించే ఏర్పాట్లు చేస్తోంది. మే 17న(సోమవారం) ప్రత్యేక కమర్షియల్ విమానంలో భారత్కు వాటిని తరలిస్తారు." అని అన్నారు. "ఈ సంక్షోభ సమయంలో మేము భారత్కు అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకే ఎప్పటికప్పుడు భారత అధికారులను సంప్రదించి, ఎలాంటి సహాయక చర్యలు కావాలన్న చేపట్టేందుకు రెడీగా ఉన్నట్లు తెలియజేస్తున్నాం. ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి నేపథ్యంలో ప్రస్తుతం కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇండియాకు తాము బాసటగా నిలుస్తున్నాం." అని డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.