జులై నుంచి ప్రీ ప్రైమరీ విద్య
ABN , First Publish Date - 2021-06-18T05:10:21+05:30 IST
జులై నెల ఒకటి నుంచి వైఎస్సార్ ప్రీప్రైమరీ విద్య అమలు జరుగనుందని ఐసీడీఎస్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.చిన్నయ్యదేవి తెలిపారు. గజపతినగరంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఐసీడీఎస్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ చిన్నయ్య దేవి
గజపతినగరం, జూన్ 17: జులై నెల ఒకటి నుంచి వైఎస్సార్ ప్రీప్రైమరీ విద్య అమలు జరుగనుందని ఐసీడీఎస్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.చిన్నయ్యదేవి తెలిపారు. గజపతినగరంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా 3, 4 ఏళ్ల వయసు పిల్లలకు ప్రీప్రైమరీ కిట్లను అందిస్తామన్నారు. కరోనా బారిన పడిన తల్లులు, పిల్లల్లో మానవతా దృక్పథంతో ఆత్మస్థైర్యం నింపేలా కృషి చేయాలన్నారు. మూడేళ్లు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకురావాలని, ఐదేళ్లు దాటిన పిల్లలను ప్రధానోపాధ్యాయుల సహకారంతో పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆమె వెంట ఐసీడీఎస్ ఏపీడీ సూర్యలక్ష్మి, సూపర్వైజర్ సూర్యకుమారి తదితరులు ఉన్నారు.