రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ విజయవంతం : రాజ్నాథ్ సింగ్
ABN , First Publish Date - 2021-03-30T22:30:28+05:30 IST
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు జరిగిన బైపాస్ సర్జరీ విజయవంతమైందని
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు జరిగిన బైపాస్ సర్జరీ విజయవంతమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో ఆయనకు ఈ చికిత్స జరిగినట్లు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు. రాష్ట్రపతి కోవింద్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ డైరెక్టర్ను అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో రాష్ట్రపతి కోవింద్ గత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ (ఆర్ అండ్ ఆర్) ఆసుపత్రిలో హెల్త్ చెక్-అప్ చేయించుకున్నారు. ప్లాన్డ్ బైపాస్ ప్రొసీజర్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో కోవింద్ను మార్చి 27న మధ్యాహ్నం ఎయిమ్స్కు తరలించారు.
రాష్ట్రపతి ఆసుపత్రిలో ఉన్నప్పటికీ అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వం కన్నా ఎక్కువ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెట్టే బిల్లుకు ఆయన ఆమోదం తెలిపారు.