మురుగు డ్రైన్లకు అడ్డుకట్ట వేయండి

ABN , First Publish Date - 2020-02-23T06:28:55+05:30 IST

ప్రతి సంవత్సరం దాళ్వాసీజన్‌లో సాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు నీటిసంఘాల ద్వారా మురుగుడ్రైన్లకు అడ్డుకట్టలు వేసి పంటపొలాలకు నీటిని మళ్లించే ప్రక్రియను చేపట్టి సాగునీటి ఇబ్బందులు

మురుగు డ్రైన్లకు అడ్డుకట్ట వేయండి

వంతులవారీ విధానంతో సాగునీటి ఇబ్బందులు


రావులపాలెం రూరల్‌: ప్రతి సంవత్సరం దాళ్వాసీజన్‌లో సాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు నీటిసంఘాల ద్వారా మురుగుడ్రైన్లకు అడ్డుకట్టలు వేసి పంటపొలాలకు నీటిని మళ్లించే ప్రక్రియను చేపట్టి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేవారు. అయితే నీటిసంఘాలు లేకపోవడంతో ఇరిగేషన్‌ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు తీవ్రతరమయ్యాయి. రావులపాలెం మండలంలోని దాళ్వాసాగుచేసిన పంటపొలాలు ప్రస్తుతం పొట్ట, చిరుపొట్ట దశలకు చేరుకున్నాయి. ఈ తరుణంలో పూర్తిస్థాయిలో సాగునీరు అందాల్సివుంది. అయితే వంతులవారీ విధానం ప్రవేశపెట్టి వారంలో కొన్నిప్రాంతాలకు కొన్నిరోజులు, కొన్నిప్రాంతాలకు మరికొన్నిరోజులు సాగునీరు అందిస్తున్నారు.


వారంలో మూడురోజులే సాగునీరు పూర్తిస్థాయిలో వస్తుండటంతో మెరకప్రాంతంలో ఉన్న పంటపొలాలకు సాగునీటి ఎద్దడి తలెత్తింది. మండల పరిధిలోని గోరింకల డ్రైన్‌లోని నీరు వృధాగా పోకుండా అడ్డుకట్టలు వేసి ఆ నీటినే పంటపొలాలకు మళ్లించే దిశగా చర్యలు తీసుకోవల్సివున్నా అధికారులు నేటివరకు ఆ ప్రక్రియ ప్రారంభించకపోవడంతో సాగునీటి కష్టాలు రైతులకు తప్పడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగుడ్రైన్లకు అడ్డుకట్టలు వేయడంతోపాటు వంతులవారీ విధానంలో వాటర్‌ లెవెల్స్‌ పెంచి సాగునీటిని సరఫరా చేయాలని మండల పరిధిలోని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-02-23T06:28:55+05:30 IST