నేడు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2021-01-11T06:46:55+05:30 IST
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యాచరణపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కొవిడ్ టీకా పంపిణీపై కార్యాచరణ
హైదరాబాద్, జనవరి 10(ఆంధ్రజ్యోతి): కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యాచరణపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి ఏ వ్యాక్సిన్ ఇవ్వనున్నారన్నది ఈ కాన్ఫెరెన్స్ తర్వాతే స్పష్టత వస్తుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా కొవిడ్ టీకా పంపిణీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, మరింత మెరుగ్గా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రానికి సీఎం కేసీఆర్ సలహాలు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
అయితే, అదే రోజు ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్లో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడం, ప్రాధాన్యతా క్రమంలో పౌరులకు అందించడం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే, కరోనా వ్యాప్తి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపైనా సమీక్షించనున్నారు.