లాక్డౌన్ ముగిసింది...
ABN , First Publish Date - 2020-10-21T08:43:21+05:30 IST
దేశంలో లాక్డౌన్ కాలం ముగిసినా వైరస్ మాత్రం ఇంకా అంతమైపోలేదని, నిలిచేఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
వైరస్ నిలిచే ఉంది
చిన్న నిర్లక్ష్యం చేసినా విషాదం తప్పదు.. పండగల వేళ జాగ్రత్త
అందరికీ వ్యాక్సిన్.. దేశ ప్రజలకు మోదీ ఏడోసారి సందేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 20: దేశంలో లాక్డౌన్ కాలం ముగిసినా వైరస్ మాత్రం ఇంకా అంతమైపోలేదని, నిలిచేఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘వచ్చేది పండగల కాలం. మార్కెట్లన్నీ కిక్కిరిసిపోతాయి. అనేకమంది వస్తువులు, వస్త్రాలు, ఇతర అవసరాలు కొనుగోలు చేయడానికి బయటికి వస్తారు. ఈ సమయంలోనే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా కన్నీళ్లు తప్పవు. మాస్క్ పెట్టుకోకుండా, దూరం పాటించకుండా తిరిగితే మీకు, మీ పిల్లలకు, పెద్దవారికి కూడా హాని తప్పదు’ అని ఆయన మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో హెచ్చరించారు. కొవిడ్ విజృంభించాక ఆయన ఇలా ప్రసంగించడం ఇది ఏడోసారి. ‘వ్యాక్సిన్ వచ్చే దాకా మనం జాగ్రత్తగా ఉండాలి... అజాగ్రత్తతో ఉంటున్న ఫొటోలు, వీడియోలు ఈ మఽధ్య వచ్చాయి. ఇది సరికాదు’ అని అన్నారు. ‘7-8 నెలలుగా ప్రజల కృషి, సహకారం వల్ల పరిస్థితి ఇప్పుడిప్పుడే నిలకడగామారుతోంది.
కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. 10 లక్షల మందిలో 5500 మందికి కరోనా సోకుతోంది. అదే అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో ఈ సంఖ్య 25వేలకు పైగా ఉంది. అమెరికా, ఐరోపా దేశాల్లో కేసులు తగ్గి మళ్లీ విజృంభించాయి. అందుచేత ఏం ఫరవాలేదులే అన్న వైఖరి మంచిదికాదు’ అని మోదీ హితవు పలికారు. ’వ్యాక్సిన్ తయారీలో ప్రపంచదేశాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తున్నాయి. మనదేశంలోనూ తీవ్ర ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రతీ భారతీయుడికీ అది అందేట్లు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మోదీ హామీ ఇచ్చారు.