క‌రోనాని ఓడించ‌డంలో యోగా న‌మ్మ‌కాన్ని పెంచింది: ప్ర‌ధాని మోదీ

ABN , First Publish Date - 2021-06-21T13:43:17+05:30 IST

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా

క‌రోనాని ఓడించ‌డంలో యోగా న‌మ్మ‌కాన్ని పెంచింది: ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈరోజు దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. నేడు ప్ర‌పంచ‌మంతా క‌రోనాతో పోరాడుతోంద‌ని, ఈ మ‌హమ్మారిని ఓడించ‌గ‌ల‌మ‌నే న‌మ్మ‌కాన్ని యోగా అందిస్తున్న‌ద‌న్నారు. ఒత్తిడి త‌గ్గించ‌డంలో, శారీర‌క బ‌లాన్నిపెంపొందింప‌జేయడంలో యోగా కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు. ప‌బ్లిక్ హెల్త్ కేర్ విష‌యంలోనూ యోగా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.


యోగాపై  ప్ర‌జ‌ల‌కు ఆస‌క్తి పెరిగింద‌ని, ఉత్సాహంగా యోగా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నార‌ని అన్నారు.  కోవిడ్ కాలంలో యోగాపై ప్రజలకు మ‌రింత ఆస‌క్తి పెరిగిందన్నారు. యోగా కార‌ణంగా మన శరీరానికి  జ‌రిగే మేలు గురించి ప్రపంచవ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు  జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. యోగా అనేది శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, అంతః చైతన్యాన్ని వృద్ధి చేస్తుంద‌ని తెలిపారు.  అనేక వ్యాధుల‌కు ముందస్తు రక్షణ కవచంగా యోగా ఉపయోగపడుతుందని ప్ర‌ధాని పేర్కొన్నారు. యోగా ఫర్ వెల్ నెస్  థీమ్‌తో ఈ ఏడాది యోగా డేని నిర్వహిస్తున్నామ‌న్నారు. శారీర‌క, మానసిక ఆరోగ్యం కోసం యోగాను అనుస‌రించాల‌నేది ఈ నినాదం ఉద్దేశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ అదే ఏడాది ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వ‌హించాల‌ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ప‌లికాయి. ఈ నేప‌ధ్యంలో ఎక్కువ పగటి స‌మ‌యం అధికంగా ఉండే జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని యూఎస్ నిర్ణ‌యించింది. 2015 లో మొదటి ఇంటర్నేషనల్ యోగా డే  నిర్వ‌హించారు. ఇప్పుడు ఏడవ యోగా డేని నిర్వ‌హిస్తున్నారు. ఈరోజు యోగా కార్యక్రమాల‌ను వివిధ దేశాల్లో కూడా నిర్వ‌హిస్తున్నారు.



Updated Date - 2021-06-21T13:43:17+05:30 IST