సేంద్రియ సాగులో ఖైదీలు భేష్
ABN , First Publish Date - 2021-01-16T05:30:00+05:30 IST
ఎటువంటి ఎరువులు వినియోగించకుండా కేవలం ఆవుపేడతో తయారుచేసిన సేంద్రియ ఎరువులతో కేంద్ర కారాగారంలోని ఖైదీలు పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
కేంద్ర కారాగారంలో పండిస్తున్న కూరగాయలు
జైలు బయట విక్రయశాలలో రోజూ అమ్మకాలు
ఆరిలోవ జనవరి 16: ఎటువంటి ఎరువులు వినియోగించకుండా కేవలం ఆవుపేడతో తయారుచేసిన సేంద్రియ ఎరువులతో కేంద్ర కారాగారంలోని ఖైదీలు పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. సుమారు 30 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులో ఉన్నాయని కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్ రామచంద్రరావు పర్యవేక్షణలో సుమారు 30 మంది ఓపెన్ ఖైదీలు వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగులో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఉదయం ఏడు గంటలకే పలుగు, పారా చేతబట్టుకుని పనిలోకి వెళుతున్నారన్నారు. సత్ప్రవర్తన గల ఖైదీలకు ఇలాంటి బాధ్యతలను అప్పగిస్తామని, వీరు సాగు చేస్తున్న కూరగాయలకు మంచి డిమాండ్ లభిస్తోందని వివరించారు.
ట్రాక్టర్తో పొలాలను దున్నడం, నారువేసి పంటలను సాగు చేయడంలో వారు అవలంభిస్తున్న మార్గాలు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కూరగాయల్లో క్యాబేజీ, వంగ, టమాటా, ఆనపకాయలు, ఆకుకూరల్లో గోంగూరతో పాటు కొబ్బరిచెట్లను పెంచుతున్నామని రాహుల్ తెలిపారు. ఇలా పండించిన వాటిలో కొంత జైలులోని ఖైదీల అవసరాలకు మినహాయించుకుని, మిగిలిన వాటిని జైలు ప్రధాన ద్వారం వద్దనున్న విక్రయశాలలో రోజూ అమ్మకాలు జరుపుతున్నామన్నారు. రైతుబజారు ధరల కంటే తక్కువకే తమ కూరగాయలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కొబ్బరికాయ ఒకటి రూ.10, టమాటా కిలో రూ.18, నల్ల వంకాయలు కిలో రూ.30, ఆనపకాయ పది రూపాయల చొప్పున విక్రయిస్తున్నామన్నారు. సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేస్తుండడంతో వాటికి మంచి రుచి వస్తోందని, అందువల్ల డిమాండ్ కూడా అధికంగా ఉందని రాహుల్ పేర్కొన్నారు.