మేలో 1.29 కోట్ల వ్యాక్సిన్లు సేకరించిన ప్రైవేటు ఆసుపత్రులు.. ఎన్ని ఉపయోగించాయంటే?

ABN , First Publish Date - 2021-06-12T21:07:03+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా టీకాలకు విపరీతమైన కొరత ఉందన్న వార్తల నడుమ ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు

మేలో 1.29 కోట్ల వ్యాక్సిన్లు సేకరించిన ప్రైవేటు ఆసుపత్రులు.. ఎన్ని ఉపయోగించాయంటే?

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా టీకాలకు విపరీతమైన కొరత ఉందన్న వార్తల నడుమ ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. గత నెలలో ప్రైవేటు ఆసుపత్రులకు అందిన వ్యాక్సిన్లలో 17 శాతం మాత్రమే ఉపయోగించారని, ఇంకా పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 4న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మే నెలలో 7.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో 1.85 కోట్ల వ్యాక్సిన్లు ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించారు.


కేటాయించిన 1.85 కోట్ల షాట్లలో 1.29 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రైవేటు ఆసుపత్రులు సేకరించాయి. అయితే, వాటిలో కేవలం 22 లక్షల డోసులను మాత్రమే అవి ఉపయోగించినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో టీకా ధరలు ఎక్కువగా ఉండడం, వ్యాక్సిన్ వేయించుకోవాలా? వద్దా? అన్న దానిపై సందిగ్ధత వల్ల టీకా నిల్వలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 24 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. ఈ ఏడాది చివరి నాటికి 108 కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

Updated Date - 2021-06-12T21:07:03+05:30 IST