ప్రైవేటు రైట్రైట్.. ఆర్టీసీ డౌటే!
ABN , First Publish Date - 2020-06-01T08:48:24+05:30 IST
అంతర్రాష్ట్ర సర్వీసులు నడపటానికి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సన్నద్ధమౌతుండగా.. మరోవైపు ఆర్టీసీ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర సర్వీసులు నడపటానికి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సన్నద్ధమౌతుండగా.. మరోవైపు ఆర్టీసీ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. రాష్ర్టాల మధ్య ప్రజా రవాణా పునరుద్ధరించటానికి వీలుగా కేంద్రం అవకాశం కల్పించటంతో.. దాదాపు రెండు నెలల తర్వాత బస్సులను ప్రైవేటు యాజమాన్యాలు బయటకు తీస్తున్నాయి. సోమవారం నుంచే వీలైనంత వరకు బస్సులను నడపటానికి సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, ఆర్టీసీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బస్సులను నడిపే అంశంపై ఉన్నత స్థాయిలో అధికారులు సమాలోచనలు జరిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆర్టీసీ భావిస్తోంది.
మన రాష్ట్రం నుంచి అంతరాష్ట్ర సర్వీసులన్నీ ఎక్కువగా పొరుగు రాష్ట్రం తెలంగాణాలోని హైదరాబాద్తో ముడిపడి ఉన్నాయి. ఆ తర్వాత కర్ణాటకలోని బెంగళూరు, తమిళనాడులోని చెన్నైలకు సర్వీసులు ఉన్నాయి. ప్రధాన రూటు హైదరాబాద్ కావటంతో.. అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో, ఇరు రాష్ర్టాలకు అంగీకారప్రాయంగా ఒక మాట అనుకున్న తర్వాత ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది.