Lakhimpur Kheri: ప్రియాంకగాంధీని నిర్బంధించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-10-04T13:32:01+05:30 IST
లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించిన ప్రియాంక గాంధీని హరగావ్లో పోలీసులు నిర్బంధించారు...
లక్నో (ఉత్తరప్రదేశ్):లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి గృహ నిర్బంధాన్ని ఉల్లంఘించిన ప్రియాంక గాంధీని హరగావ్లో పోలీసులు నిర్బంధించారు. నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారును ఉరికించడంతో నలుగురు మరణించారు. ఈ ఘటనలో బాధితులను పరామర్శించేందుకు ప్రియాంకగాంధీ సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు లఖింపూర్ ఖేరీకి బయలుదేరగా హర్గావ్ గ్రామం వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంకను పోలీసులు సీతాపూర్ అతిథి గృహానికి తరలించి నిర్బంధించారు.
ప్రియాంకగాంధీ బాధితులను కలిసేందుకు కాలినడకన వెళుతుండగా లక్నో నుంచి లఖింపూర్ ఖేరికి వెళ్లే మార్గంలో టోల్ ప్లాజాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.తాను ఇంటి నుంచి బయటకు రావడం ద్వారా నేరం చేయలేదని, బాధితులను కలిసి వారి బాధను పంచుకోవాలనుకుంటున్నానని ప్రియాంక చెప్పారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీసులు వారెంట్ లేదా ఆర్డరు చూపించి కారు ఆపాలని ప్రియాంక కోరారు.ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం లక్నో విమానాశ్రయానికి చేరుకుని నేరుగా లక్నోలోని ఆమె నివాసమైన కౌల్ హౌస్కు వెళ్లినప్పుడు పోలీసులు ఆమెను అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారు.ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు దీపేందర్ ఎస్ హుడా, ఆరాధన మిశ్రా, ప్రమోద్ తివారీలు ఉన్నారు.