అభివృద్ధిని సెలవుపై పంపాలి: ప్రియాంక గాంధీ
ABN , First Publish Date - 2021-09-02T17:19:43+05:30 IST
అభివృద్ధిని సెలవుపై పంపాలి: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: ధనవంతులు మరింత ధనవంతులు అవ్వడం, ప్రజల నిత్యవసరాల ధరలు పెరగడమే అభివృద్ధి (వికాస్) అయితే.. ఆ అభివృద్ధిని సెలవుపై పంపించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోదీని ప్రధాని పదవి నుంచి దింపేయాలనే అర్థంలో ఆమె వ్యాఖ్యానించారు. బుధవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా పెరుగుతున్న ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘‘ప్రధానమంత్రిగారు, మీ రాజ్యంలో రెండు రకాల ‘‘అభివృద్ధి’’ (వికాస్) కనిపిస్తోంది. ఒకటేమో మీ కరోడ్పతి మిత్రుల ఆదాయం అంతకంతకూ పెరిగిపోతోంది. రెండవది సాధారణ ప్రజల నిత్యవసరాలపై ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇకవేళ మీరు చెప్తున్న అభివృద్ధి ఇదే అయితే దాన్ని వెంటనే సెలవుపై పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అనే అర్థంలో ప్రియాంక గాంధీ.. హిందీలో ట్వీట్ చేశారు. దానికి తోడుగా ఈ యేడాది జనవరి నుంచి సెప్టెంబర్ 1వరకు నిత్యవసరాలపై పెరుగుతున్న ధరల పట్టికను ట్వీట్లో జత చేశారు.