యూపీ ఎన్నికలు : 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా విడుదల

ABN , First Publish Date - 2022-01-13T19:17:21+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను

యూపీ ఎన్నికలు : 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా విడుదల

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 125 మంది అభ్యర్థులను ప్రకటించగా, వీరిలో 50 మంది మహిళలు, 50 మంది యువత ఉన్నారు. 


ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల్లో  125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వీరిలో 50 మంది మహిళలు, 50 మంది యువత ఉన్నారని చెప్పారు. మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం స్థానాలను ఇచ్చినట్లు తెలిపారు. ఈ చరిత్రాత్మక చర్య ద్వారా రాష్ట్రంలో నూతన తరహా రాజకీయాలను తీసుకురాగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు.  


ఉణవ్ శాసన సభ నియోజకవర్గం నుంచి ఓ అత్యాచార బాధితురాలి తల్లిని పోటీలో నిలుపుతున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన పూనం పాండేను షాజహాన్ పూర్ నుంచి పోటీ చేయిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో న్యాయం కోసం పోరాడినవారిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామని చెప్పారు. అటువంటివారు ముందుకు వచ్చి, రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు. పోరాడే శక్తిని కాంగ్రెస్ సమకూర్చుతుందన్నారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని మీడియా అడిగినపుడు ప్రియాంక గాంధీ వాద్రా సమాధానం చెప్పలేదు. ఈ ఎన్నికల్లో నెగెటివ్ ప్రచారం చేయబోమని, ఉత్తర ప్రదేశ్ భవిష్యత్తు కోసం పాజిటివ్ ప్రచారం చేస్తామని అన్నారు. మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు. 


403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 




Updated Date - 2022-01-13T19:17:21+05:30 IST