ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించనున్న ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-10-22T23:35:06+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న

ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించనున్న ప్రియాంక గాంధీ

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం మూడు ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించనున్నారు. బారాబంకీ-బుందేల్‌ఖండ్, సహరాన్‌పూర్-మథుర, వారణాసి-రాయ్‌బరేలీ యాత్రలను ఆమె ప్రారంభిస్తారు. అక్టోబరు 23 నుంచి నవంబరు 1 వరకు ఈ యాత్రలు జరుగుతాయి. 


కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పూనియా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం బారాబంకీ-బుందేల్‌ఖండ్, సహరాన్‌పూర్-మథుర, వారణాసి-రాయ్‌బరేలీ ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోను, ఏడు వాగ్దానాలను ఆమె విడుదల చేస్తారన్నారు. 


మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ నేతృత్వంలో అవధ్ ప్రాంతంలో వారణాసి-రాయ్ బరేలీ యాత్ర జరుగుతుందన్నారు. బారాబంకీ-బుందేల్‌ఖండ్ మార్గంలో జరిగే యాత్రకు తాను, మాజీ కేంద్ర మంత్రి ప్రదీప్ జైన్ ఆదిత్య నాయకత్వం వహించనున్నట్లు చెప్పారు. మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీనియర్ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ నేతృత్వంలో సహరాన్‌పూర్-మథుర మార్గంలో యాత్ర జరుగుతుందని తెలిపారు. 


కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ నసీముద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, 2022 శాసన సభ ఎన్నికల్లో 40 శాతం టిక్కెట్లను మహిళలకు కేటాయిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి, ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన బాలికలకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ ఉత్తీర్ణులైన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు. 


Updated Date - 2021-10-22T23:35:06+05:30 IST