యూపీలో హత్యలపై Priyanka Gandhi ఆందోళన
ABN , First Publish Date - 2021-11-27T16:05:17+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలో ఓ కార్మికుడి కుటుంబానికి చెందిన నలుగురిని హతమార్చినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు....
బాధిత కుటుంబానికి ప్రియాంకా పరామర్శ
ప్రయాగరాజ్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ నగరంలో ఓ కార్మికుడి కుటుంబానికి చెందిన నలుగురిని హతమార్చినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆరోపించారు. శనివారం ప్రయాగ్రాజ్ నగరంలో బాధిత కుటుంబాన్ని ప్రియాంకాగాంధీ పరామర్శించారు. కార్మికుడైన పూల్చంద్(45), అతని భార్య మీను (40), కుమార్తె సప్న(17), కుమారుడు శివ్ (10)లు శవాలుగా కనిపించారు. పూల్ చంద్ కుటుంబంలో నలుగురు హత్యకు గురవడంతో మిగిలిన కుటుంబసభ్యులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారని ప్రియాంకా చెప్పారు. ఈ హత్యా ఘటనలో పోలీసుల అసమర్ధతను ప్రియాంకాగాంధీ ఎత్తి చూపించారు.
కాగా గ్రామంలోని కొందరిపై హత్యకు గురైన కుటుంబం ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడంతో వివాదం ముదిరి వారి హత్యకు దారి తీసిందని డీఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠి చెప్పారు. పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఐజీ చెప్పారు. మృతదేహాల సమీపంలో గొడ్డళ్లు కనిపించాయని డీఐజీ వివరించారు.త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రయాగరాజ్ హత్యోదంతం సంచలనం రేపింది.ఈ హత్య కేసులో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రియాంకాగాంధీ డిమాండ్ చేశారు.