ఇక దేవుడిపైనే భారం.. యోగి సర్కార్‌పై ప్రియాంక ఫైర్..

ABN , First Publish Date - 2021-06-23T23:44:22+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు....

ఇక దేవుడిపైనే భారం.. యోగి సర్కార్‌పై ప్రియాంక ఫైర్..

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీలో మహిళలపై దౌర్జన్యకాండ కొనసాగుతోందనీ.. ‘‘ఆటవిక రాజ్యంలో’’ మహిళలు తమ భద్రత కోసం దేవుడిపైనే భారం వేయాల్సి వస్తోందంటూ ఆమె దయ్యబట్టారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రతినిత్యం మహిళలపై దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ‘‘మొద్దు నిద్ర’’ పోతోందని ప్రియాంక ఆరోపించారు. ఇవాళ ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘‘మధురలో ఏడాది నుంచి ఓ యువతి వేధిస్తున్న కొందరు గూండాలు ఆమె ఇంట్లోకి చొరబడి టెర్రస్ మీది నుంచి తోసేశారు. హమీర్‌పూర్‌లో ఆకతాయిల వేధింపులు భరించలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది..’’ అని పేర్కొన్నారు. ‘‘ఆటవిక రాజ్యంలో మహిళలను దేవుడే కాపాడాలి..’’ అంటూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్ధేశించి ఆమె విమర్శించారు. ముగ్గురు వ్యక్తులు నిన్న ఓ ఇంట్లోకి చొరబడి 17 ఏళ్ల యువతిని రెండో అంతస్తు నుంచి కిందికి తోసేసిన ఘటనపై ప్రియాంక ఈ మేరకు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. కాగా జిల్లా పోలీసులు ఇప్పటికే మొత్తం ముగ్గురు నిందితులకు గానూ ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

Updated Date - 2021-06-23T23:44:22+05:30 IST