ఆమోదంతోనే సరా !
ABN , First Publish Date - 2021-11-30T05:45:56+05:30 IST
కౌన్సిల్ సమావేశాల్లో అజెండాలోని అభివృద్ధి పనులన్నీ ఆమోదం పొందుతాయి.. కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్ కూడా మంజూరు చేస్తారు.. కానీ నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావు.
నిడదవోలులో అభివృద్ధి పనుల జాడేదీ ?
కొత్త పాలక వర్గం ఏర్పడి 8 నెలలు పూర్తి
ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి
నేడు కౌన్సిల్ 9వ సాధారణ సమావేశం
కౌన్సిల్ సమావేశాల్లో అజెండాలోని అభివృద్ధి పనులన్నీ ఆమోదం పొందుతాయి.. కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్ కూడా మంజూరు చేస్తారు.. కానీ నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావు. అయినా ఇటు పాలక వర్గం కానీ, అటు మున్సిపల్ అధికార్లు కానీ పట్టించుకోరు. ఇదీ నిడదవోలు పురపాలక సంఘం ప్రత్యేకత.. నేడు కౌన్సిల్ సమావేశం..
నిడదవోలు,నవంబరు 29: నిడదవోలు పురపాలక సంఘం నూతన కార్య వర్గం ఏర్పడిన తర్వాత కౌన్సిల్ మొట్టమొదటి సమావేశం ఈ ఏడాది మార్చి 30న జరిగింది. కౌన్సిల్లో ఆమోదించిన ముఖ్యమైన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. పట్టణంలోని ప్రధాన సమస్యలైన కంపోస్టు యార్డు కాంపౌండు వాల్ నిర్మాణం గానీ, గణేశ్ చౌక్ సెంటర్లో డ్రైన్లు, ఫుట్పాత్ నిర్మించేందుకు స్థల విస్తరణ జరిపి ప్రైవేటు భవనాలు ఎన్నింటినో సగానికి పైగా తొలగించారు. ఆగ మేఘాల మీద పనులు ప్రారంభిస్తామని పురపాలక సంఘ అధికా రులు చెప్పారు. అయితే నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్ ఆ పనులు ప్రారంభించ లేదు. దీంతో గణేశ్ చౌక్ సెంటరులో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు కౌన్సిల్లో ఏకగ్రీ వంగా తీర్మానం పొంది కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అయితే ఆ పనులేవీ ప్రారంభం కాకపోయినా పర్య వేక్షించాల్సిన మున్సిపల్ పాలకవర్గం, అధికార్లు మౌనం వహించడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కంపోస్ట్ యార్డు కాంపౌండు వాల్ నిర్మాణం ఏదీ?
నిడదవోలు 28 వార్డులకు సంబంధించిన చెత్తను వేసే కంపోస్ట్ యార్డు కాంపౌండు వాల్ కూలి ఎంతో కాలమైంది. దీంతో లోపల ఉన్న చెత్తంతా బైటకు వచ్చి పక్కనే ఉన్న మోషేన్ లెప్రసీ కాలనీ వాసులు, కోట సత్తెమ్మ దేవస్థానానికి వచ్చే భక్తులు దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కంపోస్టు యార్డుకు వాల్ నిర్మాణానికి ఈ ఏడాది మార్చి 30న మొదటి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో రూ.5,78,248/–ల నిధులతో వాల్ నిర్మించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టరుకు వర్క్ ఆర్డర్ మంజూరు చేశారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటికి వాల్ నిర్మాణం ప్రారంభం కాలేదు. పాలకవర్గం ఆమోదించడమే కాని పనులు జరిగేలా చొరవ చూపించలేక పోతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫుట్పాత్, డ్రెయినేజీ నిర్మాణం ఎప్పుడో?
గణేష్చౌక్ సెంటరు నుంచి ఆర్వోబీ వరకు అలాగే గణేష్చౌక్ సెంటరు నుం చి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రోడ్లు భవనాల శాఖ పక్కా సిమెంటు రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డుకు ఇరుపక్కలా ఫుట్పాత్, డ్రెయినేజీ నిర్మాణానికి టెండర్లు పిలవగా స్పందనే లేదు. ఆఖరికి ఆరోసారి టెండర్లు పిలువగా రూ. 23,32,910/–లతో నిర్మించేందుకు సింగిల్ టెండర్ దాఖలైంది. ఈ ఏడాది సెప్టెంబరు 3న కౌన్సిల్ టెండరును ఆమోదించగా అధికారులు వర్క్ ఆర్డర్ మంజూరు చేశారు. మరో పక్క పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది రోడ్డుకు ఇరుపక్కలా డ్రెయినేజీ, ఫుట్పాత్ నిర్మా ణం కోసం పక్కా భవనాలను సగానికి పైగా తొలగించేశారు. వీటిని తొలగించి నెలలు గడుస్తున్నాయి. అయితే నేటికీ పనులు ప్రారంభం కాలేదు. పనులు ప్రారంభం కానప్పుడు భవనాలను సగానికి పైగా తొలగించి వదిలేయడంతో వ్యాపారులు, ప్రజలు పాలకులు, అధికార్లపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
కౌన్సిల్ తీరే వేరు !
నిడదవోలు పట్టణంలో 27 మంది అధికార వైసీపీ కౌన్సిలర్లు కాగా నేను ఒకే ఒక్కడిని టీడీపీ కౌన్సిలర్ని. కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని అంశాల వారీగా ప్రజా సమస్యలు చర్చించేందుకు అవకాశం ఇవ్వరు. అజెండా మొత్తం పూర్తయ్యాక అవకాశం ఇస్తామంటారు. నేను సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్ళినా స్పందించరు. అజెండాను ఏకగ్రీవంగా ఆమోదించడమే కాని సాధ్యా సాధ్యాలను పరిశీలించరు. పట్టణంలో అభివృద్ధి పనులపై పారదర్శ కంగా పార్టీలకతీతంగా చర్చించినప్పుడే అభివృద్ధి జరుగుతుంది.
–కారింకి నాగేశ్వర రావు, టీడీపీ కౌన్సిలర్
======================
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
భీమడోలు, నవంబరు 29 : భీమడోలు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం తెల్లవారుజామున రైలెక్కేందుకు వచ్చిన వ్యక్తి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ప్లాట్ఫారం చివరకు వెళ్ళి ట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు 45–50 ఏళ్ల మధ్య ఉంటుందని, 5.5 అడుగుల పొడవు, ఎరుపు రంగు టీ షర్టు, సిమెంటు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతుడి సమాచారం తెలిసిన వారు 80740 55378 నంబర్కు సమాచారం అందించాలని హెడ్ కానిస్టేబుల్ సూచించారు.
రైలు ఢీకొని ట్రాక్మన్ దుర్మరణం
ఉంగుటూరు, నవంబరు 29: సోమవారం తెల్లవారుజామున ప్రమాదవ శాత్తు రైలు ఢీకొని ట్రాక్మన్ మృతి చెందాడు. ఉంగుటూరు మండలంలో ఉంగుటూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ట్రాక్ను పరిశీలిస్తున్న సమయంలో తిరుమల ఎక్స్ప్రెస్ ఢీకొని అశోక్ కుమార్ (28) దుర్మరణం పాలయ్యాడు. మృతుడిది విశాఖ జిల్లా భీమిలి.