సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-10T04:33:39+05:30 IST

ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 9: ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ చాంబర్‌లో సోమవారం కలెక్టర్‌ ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రానికి చెందిన ఎంఎ సలీం 2016లో ప్రభుత్వం చేపట్టిన పంచాయతీ కార్యదర్శుల నియమకంలో తనకు రావాల్సిన ఉద్యోగం వేరొకరు చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశాడు. కాగజ్‌నగర్‌ మండల కేంద్రానికి చెందిన విజయ్‌కుమార్‌ తాను దివ్యాంగుడినని డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్‌ కోర్సు నేర్చుకున్నానని, ఉపాధి కల్పించి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఆసిఫాబాద్‌ మండలం టీఆర్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ రిజ్వాన అంజూమ్‌ నిరుపేదరాలైన తనకు ఇంటి స్థలం మంజూరు చేసి ఆదుకోవాలని, కౌటాల మండలానికి చెందిన రామచందర్‌ ఎస్టీ గోండు కులానికి చెందిన తాను కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాని, మూడు ఎకరాల భూమి కేటాయించాలని వినతులు సమర్పించారు. కోండపల్లి గ్రామ పంచాయతీలోని బుద్దనగర్‌ గ్రామస్థులు మిషన్‌ భగరీథ పథకంలో నల్లా కనెక్షన్లు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమ లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Read more