బ్రాండ్లకు భారీ గండి!
ABN , First Publish Date - 2020-06-02T06:13:46+05:30 IST
కరోనా ఉగ్రరూపానికి కార్పొరేట్ కంపెనీల బ్రాండ్ విలువ హారతి కర్పూరంలా కరిగిపోతోంది. దేశీయ టాప్-100 బ్రాండ్ల మొత్తం విలువకు 2,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.88 లక్షల కోట్లు) మేర గండిపడవచ్చని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి నమోదైన బ్రాండ్ల మొత్తం విలువలో...
- కరోనా దెబ్బకు తరుగుతున్న విలువ
- టాప్-100 బ్రాండ్ల వాల్యూలో రూ.1.88 లక్షల కోట్ల తరుగుదల
- బ్రాండ్ ఫైనాన్స్ 2020 రిపోర్టు అంచనా
ముంబై: కరోనా ఉగ్రరూపానికి కార్పొరేట్ కంపెనీల బ్రాండ్ విలువ హారతి కర్పూరంలా కరిగిపోతోంది. దేశీయ టాప్-100 బ్రాండ్ల మొత్తం విలువకు 2,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.88 లక్షల కోట్లు) మేర గండిపడవచ్చని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి నమోదైన బ్రాండ్ల మొత్తం విలువలో ఇది 15 శాతానికి సమానమని తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలోని టాప్-500 కంపెనీల బ్రాండ్ విలువ లక్ష కోట్ల డాలర్లు (రూ.75 లక్షల కోట్లు) మేర తరిగిపోవచ్చని రిపోర్టులో పేర్కొంది.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
- ప్రపంచంలోని టాప్-100 బ్రాండ్లలో స్థానం దక్కించుకున్న ఏకైక భారత కంపెనీ టాటా. ఈ గ్రూప్ 85వ స్థానంలో ఉంది. 100 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్లో 7.20 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు
- ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి రిటైల్, టెలికాం, మీడియా వ్యాపారాల్లోకి విస్తరించడం రిలయన్స్ బ్రాండ్ విలువ మరింత పెరగడానికి దోహదపడింది
- కష్టకాలంలోనూ బ్యాంకుల బ్రాండ్ విలువ మరింత వృద్ధి చెందింది. టాప్-100 దేశీయ బ్రాండ్లలో 14 బ్యాంక్లకు చోటు లభించింది. వీటన్నింటి బ్రాండ్ విలువ 25 శాతం వృద్ధి చెంది 2,490 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఎస్బీఐ బ్రాండ్ వేల్యూ 8 శాతం వృద్ధి చెంది 640 కోట్ల డాలర్లకు, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ విలువ 22 శాతం వృద్ధితో 590 కోట్ల డాలర్లకు చేరింది. అయితే, కరోనా సంక్షోభం నేపథ్యంలో టాప్ బ్యాంక్ల బ్రాండ్ విలువ 20 శాతం మేర క్షీణించే అవకాశం ఉంది.
టాటా.. నెం.1 బ్రాండ్
ఈ ఏడాదికి గాను దేశంలోని అత్యంత విలువైన కార్పొరేట్ బ్రాండ్గా టాటా గ్రూప్ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అంతేకాదు, తొలిసారిగా టాటా బ్రాండ్ విలువ 2,000 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించిందని బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే మాత్రం టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 2 శాతమే పెరిగింది. ఈ గ్రూప్నకు చెందిన లగ్జరీ హోటళ్ల నిర్వహణ సంస్థ ‘తాజ్’.. దేశంలోనే అత్యంత పట్టున్న బ్రాండ్గా నిలిచింది. బీమా దిగ్గజం ఎల్ఐసీకి రెండో స్థానం దక్కగా.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ్సకు మూడో స్థానం లభించింది.
ఇన్ఫోసిస్ 4, ఎస్బీఐ 5, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ 6, మహీంద్రా 7, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 8, హెచ్సీఎల్ 9, ఎయిర్టెల్ 10వ స్థానంలో ఉన్నాయి. గత ఏడాది జాబితాతో పోలిస్తే హెచ్డీఎ్ఫసీ బ్యాంక్ ఒక స్థానం ఎగబాకగా.. మహీంద్రా ఒక స్థానం కిందికి జారుకుంది. ఐఓసీ ఏకంగా 7 స్థానా లు ఎగబాకగా.. ఎయిర్టెల్ 2 స్థానాలు కిందికి జారుకుంది. గత ఏడాది జాబితాలో 10 స్థానంలో నిలిచిన విప్రో ఈసారి 11వ స్థానానికి పరిమితమైంది.