తెలుగు రాష్ట్రాల్లో నిండుతున్న ప్రాజెక్టులు

ABN , First Publish Date - 2020-08-11T18:40:38+05:30 IST

బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నిండుతున్న ప్రాజెక్టులు

హైదరాబాద్: బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. జలాశయాలు క్రమంగా నిండుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 10 టీఎంసీల నీరు వచ్చి చేరింది. కృష్ణానదిలో ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు జురాల ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి లక్షా 98వేల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 22,743 క్యూసెక్కులు విడుదల చేశారు.


శ్రీశైలం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 14.21 టీఎంసీలమేర నీటి నిల్వ పెరిగింది. తుంగభద్రకు కూడా భారీ వరద వస్తోంది. రెండు రోజుల్లో ఈ ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్‌లో కూడా నీటిమట్టం పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆలూరు, ఆస్పారి, పత్తికొండ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో గాజుల దిన్నె ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి నీరు చేరడంతో  రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

Updated Date - 2020-08-11T18:40:38+05:30 IST