దోషులను వెంటనే శిక్షించాలి
ABN , First Publish Date - 2021-08-02T05:55:43+05:30 IST
తమకు న్యాయం చేయాలంటూ శనివారం హత్యకు గురైన బొడ్డు సాగర్రెడ్డి కుటుంబసభ్యులు ఆదివారం మండలంలోని కొత్తనందాయపాలెం జాతీయ రహదారిపై బైఠాయించారు.
జాతీయ రహదారిపై మృతదేహంతో ధర్నా
కర్లపాలెం, ఆగస్టు 1: తమకు న్యాయం చేయాలంటూ శనివారం హత్యకు గురైన బొడ్డు సాగర్రెడ్డి కుటుంబసభ్యులు ఆదివారం మండలంలోని కొత్తనందాయపాలెం జాతీయ రహదారిపై బైఠాయించారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. సాగర్రెడ్డి మృతదేహం కొత్తనందాయపాలేనికి చేరుకోగానే వందలాదిమంది గ్రామస్తులు జాతీయ రహదారిపైన మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉపసభాపతి కోన రఘుపతి అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రెండుగంటల పాటు జాతీయ రహదారిపైన వందలాదిమంది ధర్నాకు పాల్పడటంతో ఇరువైపులా కిలోమీటరు దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాసరెడ్డి మృతుడి కుటుంబసభ్యులు, గ్రామపెద్దలతో సమావేశమై న్యాయం జరిగేవిధంగా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఆందోళనలో పాతనందాయపాలెం, కొత్తనందాయపాలెం, ఏట్రవారిపాలెం, ఎంవీ రాజుపాలెం, కర్లపాలెం గ్రామాలకు చెందిన ఓ వర్గానికి చెందినవారు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.