8 నిమిషాల 46 సెకన్లు!
ABN , First Publish Date - 2020-06-05T07:36:38+05:30 IST
అమెరికాలో శ్వేత జాత్యహంకార దాడులు, పోలీసుల దాష్టీకాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని ఉద్యమాలకు నినాదాలు ఉంటాయి...
- అమెరికాలో నిరసనకారుల నినాదమిదే
- ఫ్లాయిడ్ మెడపై పోలీసు మోకాలితో నొక్కిన సమయమిది
వాషింగ్టన్, జూన్ 4: అమెరికాలో శ్వేత జాత్యహంకార దాడులు, పోలీసుల దాష్టీకాలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని ఉద్యమాలకు నినాదాలు ఉంటాయి.. కానీ, జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలకు 8:46 (8 నిమిషాల 46 సెకన్లు)అంకే నినాదంగా మారింది. ఫ్లాయిడ్ను అరెస్టు చేసిన పోలీసు అధికారి అతని మెడపై మోకాలితో నొక్కి ఉంచిన సమయమిది. పోలీసుల దాష్టీకాలపై తొలుత ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ ఫ్లాయిడ్ చివరి మాటలనే నినాదాలు, పోస్టర్లుగా మార్చి నిరసన తెలిపిన ఆందోళనకారులు.. ఇప్పుడు ‘8:46’ అంకెలను వాడుతున్నారు. హ్యూస్టన్లో చర్చికి వెళ్లి కొవ్వొతులతో 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించారు. ఎంటీవీలో 8 నిమిషాల 46 సెకన్లు విషాద, నిశ్శబ్ద వీడియోను ప్రసారం చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచ్చయ్ సూచన మేరకు ఉద్యోగులు 8:46 నిమిషాలు పని ఆపేశారు. ఇక కాలిఫోర్నియాలో లూటీలు, ఆస్తుల విధ్వంసానికి సంబంధించి 100 మందిపై కేసులు నమోదు చేశారు. బ్రూక్లిన్లో ఆందోళనకారులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అల్లర్లను అణచివేతకు సైన్యాన్ని దించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పెంటగాన్ చీఫ్ వ్యతిరేకించారు. ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసు అధికారి డెరెక్పై గతంలో థర్డ్ డిగ్రీ హత్యానేరం మోపిన అధికారులు ఇప్పుడు దాన్ని సెకండ్ డిగ్రీకి పెంచారు. ఇతర అధికారులపైనా కఠిన అభియోగాలు మోపారు. ఈ చర్యలతో ఆందోళనకారులు కొంత శాంతించారు.
ఫ్లాయిడ్కు కొవిడ్..!
పోలీసు చేతిలో హత్యకు గురైన జార్జ్ ఫ్లాయిడ్ (46)కు కొవిడ్ వైరస్ సోకింది. అతనికి ఏప్రిల్ 3న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు చెప్పారని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనంలో తెలిపింది. ఫ్లాయిడ్ మరణించిన తర్వాత శాంపిల్స్ తీసి పరీక్షించగా కొవిడ్ పాజిటివ్ వచ్చిందని మిన్నెసోటా వైద్యాధికారులు తెలిపారు. అయితే వైరస్ కారణంగా అతను చనిపోలేదని తేల్చిచెప్పారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ (44) ఎంతో అనుభవజ్ఞుడు. అనేక పతకాలు గెలుచుకున్నాడు. అలాగే అతనిపై 17 ఫిర్యాదులూ ఉన్నాయి. ఇక శ్వేతసౌధంలోని బంకర్లోకి వెళ్లడంపై ట్రంప్ వివరణ ఇచ్చారు. తాను ఆందోళనకారులకు భయపడి బంకర్లో దాక్కోవడానికి వెళ్లలేదన్నారు. బంకర్ను తనిఖీ చేయడానికే వెళ్లానని చెప్పారు.
గాంధీ విగ్రహంపై రంగులు
అమెరికాలో ఆందోళనకారులు మహాత్మాగాంధీ విగ్రహాన్నీ వదల్లేదు. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ఆందోళనలు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ఎదుట ఉన్న మహాత్ముడి విగ్రహంపై ఆందోళనకారులు రంగులు చల్లి అవమానించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహాత్ముడి విగ్రహాన్ని అవమానించడంపై భారత్లో అమెరికా రాయబారి కెన్ జస్టర్ క్షమాపణలు చెప్పారు.