చంద్రబాబు సభలో రాళ్ళదాడిపై నిరసనలు
ABN , First Publish Date - 2021-04-14T06:53:10+05:30 IST
తిరుపతిలో సోమవారం రాత్రి చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో కార్యకర్తలపై రాళ్ళ దాడి జరగడం పట్ల చిత్తూరు జిల్లాలో పలుచోట్ల టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
తిరుపతి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో సోమవారం రాత్రి చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో కార్యకర్తలపై రాళ్ళ దాడి జరగడం పట్ల చిత్తూరు జిల్లాలో పలుచోట్ల టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. తిరుపతి నగరంలో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం కూడలి నుంచీ గాంధీ విగ్రహం కూడలి వరకూ పాదయాత్ర చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నోళ్ళకు అడ్డుగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి రాళ్ళదాడికి పాల్పడడం అప్రజాస్వామికమంటూ వినతిపత్రం సమర్పించారు. ఇక కుప్పంలో తెలుగుదేశం పార్టీ నేతలు రాళ్ళదాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తిలో శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ ప్లకార్డు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. గుడిపాలలో టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగగా సత్యవేడులో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మోకాళ్ళపై నిలుచుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు మీడియా సమావేశాలు నిర్వహించి రాళ్ళదాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.