హైకోర్టుల్లో తాత్కాలిక జడ్జిలు!

ABN , First Publish Date - 2021-04-09T06:40:09+05:30 IST

వివిధ రాష్ట్రాల హైకోర్టులలో పెండింగ్‌ కేసుల పరిష్కారంలో భాగంగా తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాలకు వీలుగా సుప్రీంకోర్టు ఒక యంత్రాంగాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

హైకోర్టుల్లో తాత్కాలిక జడ్జిలు!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: వివిధ రాష్ట్రాల హైకోర్టులలో పెండింగ్‌ కేసుల పరిష్కారంలో భాగంగా తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాలకు వీలుగా సుప్రీంకోర్టు ఒక యంత్రాంగాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సీజేఐ ఎస్‌ఏ బోబ్డే ఈనెల 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈలోగా ఆయన దీనికి సంబంధించిన ప్రక్రియకు అంకురార్పణ చేయనున్నారు. పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు హైకోర్టులలో తాత్కాలిక జడ్జిలను నియమించాలంటూ ఒక స్వచ్ఛంద సంస్థ వేసిన వ్యాజ్యాన్ని బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. వివిధ హైకోర్టులలో ఉన్న నలుగురు సీనియర్‌ న్యాయవాదులు వర్చువల్‌ సమావేశం జరిపి నాలుగు ప్రధాన అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వచ్చే బుధవారంలోగా తమకు సమర్పించాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. సీనియర్‌ న్యాయవాదులు అరవింద్‌ దత్తార్‌, ఆర్‌ బసంత్‌, వికాస్‌ సింగ్‌, రవీంద్ర శ్రీవాస్తవలకు ఈ బాధ్యత అప్పగించింది. 

Updated Date - 2021-04-09T06:40:09+05:30 IST