పీఎస్‌యూల భూముల అమ్మకానికో కంపెనీ

ABN , First Publish Date - 2021-10-18T07:32:37+05:30 IST

ప్రైవేటీకరణకు ముందే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌యూ) మిగులు భూములు, ఇతర కీలకేతర ఆస్తుల..

పీఎస్‌యూల భూముల  అమ్మకానికో కంపెనీ

త్వరలో కేబినెట్‌ ముందుకు ప్రతిపాదన జూ దీపం కార్యదర్శి పాండే 

న్యూఢిల్లీ: ప్రైవేటీకరణకు ముందే  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌యూ) మిగులు భూములు, ఇతర కీలకేతర ఆస్తుల నగదీకరణకు ప్రభుత్వం సిద్ధమవు తోంది. ఇందుకోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) రూపంలో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనను త్వరలోనే కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పంపిస్తామని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే చెప్పారు. కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించిన వెంట నే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) ఈ ంస్థల ఆస్తుల నగదీకరణ ప్రక్రియ ప్రారంభిస్తుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ముగిసేలోగా బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా,ఐడీబీఐ బ్యాంక్‌, బీఈఎంఎల్‌, పవన్‌ హాన్స్‌ ప్రైవేటీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈలోపే వాటి మిగులు భూములు, కీలకేతర ఆస్తులను కొత్తగా ఏర్పాటు చేసే ఎస్‌పీవీకి  బదిలీ చేయనుంది.


రోజుకు రూ.20 కోట్లు ఆదా: ఎయిరిండియా ప్రైవేటీకరణను పాండే సమర్ధిం చారు. దీనివల్ల రోజుకు రూ.20 కోట్ల పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఆదా అవు తుందన్నారు. నష్టాల్లో ఉన్న ఎయిరిండియా నిర్వహణ కోసం ప్రస్తుతం ప్రభుత్వం రోజుకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కాగా ఎయి రిండియాను గాడిన పెట్టేందుకు ‘టాటా’ భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2021-10-18T07:32:37+05:30 IST