రూ.84 కోట్లు చెల్లించండి.. పీటీఐకి నోటీసు

ABN , First Publish Date - 2020-07-14T06:44:53+05:30 IST

ఆఫీసు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’(పీటీఐ)కి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసింది...

రూ.84 కోట్లు చెల్లించండి.. పీటీఐకి నోటీసు

న్యూఢిల్లీ, జూలై 13: ఆఫీసు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రముఖ వార్తా సంస్థ ‘ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా’(పీటీఐ)కి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఆఫీసులోని అక్రమ నిర్మాణాలను ఈనెల 14లోగా తొలగించాలని, లేదా రూ.84.48 కోట్లు జరిమానాగా చెల్లించి ఆ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవాలని భూ అభివృద్ధి విభాగం ఈనెల 7న జారీ చేసిన నోటీసులో పేర్కొన్నది. నోటీసు జారీ చేసిన 30 రోజుల్లోగా నిబంధనల ప్రకారం మార్పులు చేసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న భూమి ధరల సవరణ జరిగితే దాని విలువలో ఉన్న తేడాను కూడా చెల్లించేలా ఒప్పుందం కుదుర్చుకోవాలని పేర్కొంది. ప్రభుత్వ జాతీయ ప్రసారసంస్థ ‘ప్రసార భారతి’తో పీటీఐకి ఇటీవల విభేదాలు తలెత్తాయి. గల్వాన్‌ లోయలో ఘర్షణలకు భారతే కారణమని చైనా రాయబారి సున్‌ వీడాంగ్‌ ఆరోపించిన ఇంటర్వ్యూను పీటీఐ ప్రచురించడంపై ప్రసార భారతి భగ్గుమంది. పీటీఐ చర్యను దేశ వ్యతిరేకమైనదిగా పేర్కొంది. ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ కూడా భవన నిర్మాణంలో ‘నిబంధనల ఉల్లంఘన’ నోటీసు జారీ చేయడం గమనార్హం.


Updated Date - 2020-07-14T06:44:53+05:30 IST