ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండా : ఎమ్మెల్యే పద్మారెడ్డి
ABN , First Publish Date - 2021-09-17T04:57:33+05:30 IST
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ఎజెండ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్రెడ్డి అన్నారు.
మెదక్/మెదక్ మున్సిపాలిటీ/చిన్నశంకరంపేట, సెప్టెంబరు 16 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ఎజెండ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్రెడ్డి అన్నారు. గురువారం మెదక్లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో 163 మందికి రూ.57.21 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. హవేళీఘణపూర్ మండలంలోని పలు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రజలు ఎమ్మెల్యేకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఇదిలా మ్యూజిక్ కంపోజర్ వంశీకృష్ణ కంపోంజింగ్లో ప్రముఖ గాయకుడు నర్సింహులు రచించిన జనం గుండెల్లో నిలిచిన పద్మక్క సీడీని ఎమ్మెల్యే పద్మాదేవెందర్రెడ్డి మెదక్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఏఎంసీ నూతన చైర్మన్ బట్టి జగపతి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్దయాళ్ చారి, ఉపాధ్యక్షుడు కామాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్షకుమార్ ఇచ్చిన పిలుపు మేరకు మెదక్లోకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే జమ్మిచెట్టు నాటారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్థానికులతో కలిసి ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాలకు హైదరాబాద్ డక్కన్ రౌండ్టేబుల్ 189 సంస్థ అందజేసిన బల్లలను పలు పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులకు ఎమ్మెల్యే పద్మారెడ్డి అందజేశారు. అలాగే వివిధ కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జంగరాయి, అంబాజీపేట, గవ్వలపల్లి గ్రామాల బాధితులకు రూ.10.60 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.