పునీత్ అభిమాని ఆత్యహత్య, మరో ఇద్దరు గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2021-10-30T20:38:10+05:30 IST

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక..

పునీత్ అభిమాని ఆత్యహత్య, మరో ఇద్దరు గుండెపోటుతో మృతి

బెంగళూరు: కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. తమ అభిమాన నటుడు ఇక లేరనే విషయం తట్టుకోలేని ఒక వీరాభిమాని ఏకంగా ఆత్మహత్య చేసుకోగా, మరో ఇద్దరు టీవీలో పునీత్ మరణవార్త వింటూ గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూశారు.


కర్ణాటకలోని చామ్‌రాజ్‌నగర్ జిల్లా కనూర్ తాలూకా మరురు గ్రామానికి చెందిన 30 ఏళ్ల రైతు మునియప్ప శుక్రవారంనాడు తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశాడు. పునీత్ సినిమా ఒక్కటి కూడా విడవకుండా చూసే వీరాభిమాని మునియప్ప. పునీత్ 'హెల్త్ అప్‌డేట్స్' టీవీలో చూస్తూ పునీత్ ఇకలేరనే వార్త బయటకు రాగానే అతను గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. పొన్నాచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అతనిని తరలించే సమయానికే కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పునీత్ మరో అభిమాని అయిన పరశురాం కూడా గుండెపోటుతో కన్నుమూశాడు. బెలగవి జిల్లా షిండోలి గ్రామానికి చెందిన పరశురాం టీవీ చూస్తూ దుఃఖం ఆపుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అతను ప్రాణాలు కోల్పోయాడు.


కాగా, పునీత్‌ వీరాభిమాని అయిన రాహుల్ గాడివద్దర అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లోనే పునీత్‌కు నివాళులర్పించి, ఫోటోకు దండ వేశాడు. ఆ వెంటనే ఉరివేసుకుని తనువు చాలించాడు. ఉడిపి జిల్లా సాలిగ్రామ చెందిన ఆటో డ్రైవర్ సతీష్ (35) సైతం పునీత్ మరణవార్త విని తట్టుకోలేక తన ఆటోను చేతితో బలంగా కొట్టడంతో రక్తస్రావం జరిగింది. రక్తతర్పణంతో తన నివాళి తెలియజేసుకున్నట్టు ఆ అభిమాని తెలిపాడు.

Updated Date - 2021-10-30T20:38:10+05:30 IST