Coal దెబ్బకు కుదేలైన పంజాబ్

ABN , First Publish Date - 2021-10-13T18:47:12+05:30 IST

ఉత్తరాది మొత్తం మీద పంజాబ్ తీవ్ర విద్యుత్తు కొరతను

Coal దెబ్బకు కుదేలైన పంజాబ్

న్యూఢిల్లీ : ఉత్తరాది మొత్తం మీద పంజాబ్ తీవ్ర విద్యుత్తు కొరతను ఎదుర్కొంటోంది. ప్రస్తుత బొగ్గు సంక్షోభం ఆ రాష్ట్రాన్ని మరింత దెబ్బతీస్తోంది. అక్టోబరు 11న దాదాపు 2,300 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడటంతో, విద్యుత్తు కోతలను అమలు చేసింది. మంగళవారం కూడా 4 నుంచి 7 గంటల పాటు విద్యుత్తు కోత విధించింది. సోమవారంనాటి రోజువారీ కార్యకలాపాల నివేదిక ప్రకారం పంజాబ్‌లో 11,046 మెగావాట్ల విద్యుత్తుకు డిమాండ్ ఉండగా, వినియోగదారులకు 8,751 మెగావాట్లు సరఫరా చేశారు. ఈ నివేదికను నార్తర్న్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విడుదల చేసింది.


హర్యానాలో విద్యుత్తు డిమాండ్ 8,382 మెగావాట్లు కాగా, కేవలం 63 మెగావాట్లు మాత్రమే తక్కువ సరఫరా అయింది. వినియోగదారులకు 8,319 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేశారు. రాజస్థాన్‌లో 12,534 మెగావాట్ల విద్యుత్తుకు డిమాండ్ ఉంది, అయితే 272 మెగావాట్లు తగ్గింది. వినియోగదారులకు 12,262 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేశారు. ఢిల్లీలో విద్యుత్తు కొరత లేదు. అక్టోబరు 11న విద్యుత్తు డిమాండ్ 4,683 మెగావాట్లు కాగా, ఈ మొత్తం విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో  19,843 మెగావాట్ల విద్యుత్తుకు డిమాండ్ ఉంది, అయితే 18,973 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే వినియోగదారులకు అందించగలిగారు. ఈ రాష్ట్రంలో 870 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉంది. 


ఉత్తరాఖండ్‌లో విద్యుత్తు డిమాండ్ 2,052 మెగావాట్లు కాగా, 1,862 మెగావాట్లు మాత్రమే సరఫరా అయింది. హిమాచల్ ప్రదేశ్‌లో విద్యుత్తు కొరత లేదు. జమ్మూ-కశ్మీరులో 200 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉంది. 


పంజాబ్ రాష్ట్ర విద్యుత్తు మండలి ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అజయ్ పాల్ సింగ్ అట్వల్ మాట్లాడుతూ, ప్రభుత్వ యాజమాన్యంలోని థర్మల్ ప్లాంట్లను పీఎస్ఈబీ నడిపేటపుడు 30-40 రోజులకు సరిపోయిన బొగ్గును నిల్వ చేసేదని చెప్పారు. ఈ విధంగా నిల్వలను ఉంచుకుని ఉంటే, పంజాబ్‌‌దే పైచేయి అయి ఉండేదన్నారు. విద్యుత్తును కొనడం కాకుండా, ప్రీమియం రేట్లకు అమ్మగలిగేదని చెప్పారు.


Updated Date - 2021-10-13T18:47:12+05:30 IST