‘ఆరోగ్యం, సంక్షేమ కేంద్రాల నిర్వహణలో పంజాబ్కు ప్రథమ స్థానం’
ABN , First Publish Date - 2020-08-14T02:41:08+05:30 IST
ఆరోగ్యం, సంక్షేమ కేంద్రాల నిర్వహణలో తమ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందని పంజాబ్
చండీగఢ్ : ఆరోగ్యం, సంక్షేమ కేంద్రాల నిర్వహణలో తమ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కిందని పంజాబ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో తమ రాష్ట్రం మొదటి ర్యాంక్ సాధించిందని తెలిపింది.
పంజాబ్ రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విధించిన అష్ట దిగ్బంధనం అమల్లో ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని ఆరోగ్యం, సంక్షేమ కేంద్రాలకు గత ఐదు నెలల్లో రికార్డు స్థాయిలో 28.1 లక్షల మంది వచ్చి, సేవలు పొందినట్లు తెలిపారు.
వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. మౌలిక సదుపాయాలను ప్రజలకు అనుకూలంగా అభివృద్ధిపరుస్తున్నందువల్ల ఆరోగ్య రంగంలో పంజాబ్ త్వరలోనే అగ్ర శ్రేణి రాష్ట్రం కాబోతోందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,042 ఆరోగ్యం, సంక్షేమ కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు.