రాహుల్.. అది సరికాదు!
ABN , First Publish Date - 2021-12-02T08:02:00+05:30 IST
వచ్చే ఏడాది ఐపీఎల్లో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కొత్త జట్టుకు ఆడడం ఖరారైంది. ఎందుకంటే మంగళవారం 8 జట్లు రిటైన్ ఆటగాళ్లను ప్రకటించగా..
పంజాబ్ కింగ్స్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐపీఎల్లో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కొత్త జట్టుకు ఆడడం ఖరారైంది. ఎందుకంటే మంగళవారం 8 జట్లు రిటైన్ ఆటగాళ్లను ప్రకటించగా.. పంజాబ్ కింగ్స్ నుంచి మయాంక్, అర్ష్దీప్ మాత్రమే ఉండగా రాహుల్ పేరు కనిపించలేదు. 2020 నుంచి పంజాబ్ కెప్టెన్గా కొనసాగుతున్న రాహుల్ ఈసారి ఆ జట్టుకు ఆడేందుకు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త జట్టు లఖ్నవూతో రాహుల్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అందుకే తమతో ఒప్పందం కొనసాగుతున్న సమయంలో మరో జట్టుతో ఎలా చర్చలు జరుపుతాడని పంజాబ్ ఫ్రాంచైజీ ప్రశ్నించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని చెబుతోంది.
‘రాహుల్ను అట్టిపెట్టుకోవాలనే అనుకున్నాం. కానీ అతడేమో వేలానికి వెళ్లాలనుకున్నాడు. కానీ అంతకన్నా ముందే అతను మరో ఫ్రాంచైజీతో సంప్రదింపులు జరిపినట్టయితే అది అనైతికమే అవుతుంది. అతను ఆ జట్టు ప్రలోభాలకు లొంగితే బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్టే. రవి బిష్ణోయ్ను కూడా రిటైన్ చేసుకోవాలనుకున్నా అతడు కూడా వేలానికి మొగ్గు చూపాడు. పేసర్ షమిని వేలంలో కొనుగోలు చేయాలనుకుంటున్నాం’ అని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్లీ వాడియా వెల్లడించాడు.