పంజాబ్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఆప్
ABN , First Publish Date - 2021-11-12T22:30:25+05:30 IST
పంజాబ్లో అధికారంపై కన్నేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ..
న్యూఢిల్లీ: పంజాబ్లో అధికారంపై కన్నేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 10 మంది అభ్యర్థుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం విశేషం. ఆప్ సీనియర్ నేత, పంజాబ్ అసెంబ్లీలో విపక్ష నేత హర్పాల్ సింగ్ చీమాకు డిర్బా సీటు నుంచి టిక్కెట్ ఇచ్చారు. అమన్ అరోరా సునమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. జగ్రావ్ నుంచి సర్వజిత్ కౌర్ మనుకె, తల్వాండి సబో నుంచి బల్జీందర్ కౌర్ పోటీ చేయనున్నారు. జై కిషన్ రవుడికి గర్హ్శంకర్ సీటు, మంజిత్ బిలాస్పూర్కు నిహల్ నిహల్ సింగ్ వాలా సీటు, కుల్తార్ సింగ్ సంధ్వాన్కు కొట్కాపూర్ నుంచి, బుధ్రామ్కు బుద్లాడా నుంచి, గుర్మీత్ సింగ్ మీట్ హయర్కు బర్నాలా నుంచి, కుల్వంత్ పండోరికి మెహల్ కలన్ నుంచి సీటు ఇచ్చారు. 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.