కాలం చెల్లిన పురుగు మందుల స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-23T05:40:00+05:30 IST

మండలంలోని ముట్లూరు గ్రామంలో పాత రైసు మిల్లుపై శుక్రవారం అధికారులు దాడులు నిర్వహించి కాలం చెల్లిన పురుగుమందులు, డీఏపీ పేరుతో ఉన్న కల్తీ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు.

కాలం చెల్లిన పురుగు మందుల స్వాధీనం
కల్తీ ఎరువులను పరిశీలిస్తున్న డీడీ రామాంజనేయులు, ఏడీ శ్రీనివాసరావు, ఏవో లక్ష్మి తదితరులు

డీఏపీ పేరుతో కల్తీ ఎరువుల నిల్వలు

వాటి విలువ దాదాపు రూ6లక్షల పైనే..

వట్టిచెరుకూరు, అక్టోబరు 22: మండలంలోని ముట్లూరు గ్రామంలో పాత రైసు మిల్లుపై శుక్రవారం అధికారులు దాడులు నిర్వహించి కాలం చెల్లిన పురుగుమందులు, డీఏపీ పేరుతో ఉన్న కల్తీ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పి.రామాంజనేయులు వెల్లడించిన వివరాలివి.. గ్రామంలో రైస్‌మిల్లు యజమాని పొనగల శ్రీనివాసరావు ఉరఫ్‌ బాలస్వామి ఎటువంటి లైసెన్సులు లేకుండా ఎరువులు, పురుగుమందులు నిల్వ ఉంచాడు.  బయో డీఏపీ పేరుతో ప్లాస్టిక్‌ గోతాలను తయారుచేసి మార్కెట్‌లో బస్తారూ.1,400కు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. విక్టరీ బయోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో ఉన్న 336 డీఏపీ బస్తాలు, కాలం చెల్లిన 21 రకాల పురుగుమందులు నిల్వ ఉంచాడు.. వాటికి ఎటువంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్‌ చేసి ల్యాబ్‌కు పంపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.6లక్షల పైనే ఉంటుందన్నారు.  నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఈ తనిఖీల్లో ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో లక్ష్మి, ఆర్‌బీకే ప్రతినిధులు సుప్రజ, హారిక, గంధం నాగార్జున, వీఆర్‌ఏ బాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-23T05:40:00+05:30 IST