బ్రేకింగ్: పుట్ట మధు అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-08T14:57:46+05:30 IST
హైదరాబాద్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఆయనను పోలీసులు భీమవరంలో అరెస్ట్ చేశారు. కాగా..
హైదరాబాద్: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఆయనను పోలీసులు భీమవరంలో అరెస్ట్ చేశారు. కాగా.. గత కొన్ని రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలో ఉన్నారు. శుక్రవారం కూడా మధు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆయన ఎక్కడ ఉన్నారన్న అంశం మిస్టరీగా మారింది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తర్ఫకు గురైన ఈటల రాజేందర్కు పుట్ట మధు సన్నిహితంగా మెలగడంతోపాటు ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు కూడా నిర్వహించినట్లు, దీంతో ఆయనపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నందునే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు మూడు నెలల క్రితం జరిగిన హైకోర్టు న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
పుట్ట మధు అజ్ఞాతంపై శుక్రవారం ఆయన భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. పుట్ట మధు ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. తన భర్తకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేశారని శైలజ వివరించారు. తన భర్తపై బయట జరుగుతున్న ప్రచారం చాలా తప్పని, ప్రజా ప్రతినిధులకు పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ పార్టీలో ఉండేవారు కాబట్టి, ఆయన్ను అప్పట్లో కలిశామని పేర్కొన్నారు. తాము టీఆర్ఎస్తోనే ఉంటామని, తమను ఈ స్థాయికి తీసుకొచ్చింది సీఎం కేసీఆరేనని ఆమె స్పష్టం చేశారు. పుట్ట మధుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని శైలజ మండిపడ్డారు.