కెనడాలో ఘనంగా మాజీ ప్రధాని శతజయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-09-20T23:56:08+05:30 IST

పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కెనడాలోని టొరెంటో నగరంలో మాజీ ప్రధాని శతజ

కెనడాలో ఘనంగా మాజీ ప్రధాని శతజయంతి వేడుకలు

టొరెంటో: పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కెనడాలోని టొరెంటో నగరంలో మాజీ ప్రధాని శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యడు కె. కేశవరావు, బోయిన్‌పల్లి వినోద్ కుమార్, పి.వి.ప్రభాకర్ రావు, మహేష్ బిగాల జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా కె. కేశవరావు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సరైన గుర్తింపు తేవడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.  పీవీ నరసింహారావును 360 డిగ్రీస్ వ్యక్తిగా అభిర్ణించారు. మాజీ ప్రధాని గొప్పతనం గురించి ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారన్నారు. అంతేకాకుండా.. ‘పీవీ నరసింహారావు స్థితప్రజ్ఞుడు. మాజీ ప్రధాని పీవీ.. తెచ్చిన భూ సంస్కరణ వాల్ల ఎంతో మందికి మేలు జరిగింది. ఆయన సాదాసీదా జీవితం గడిపారు. ఎన్నో సంస్కరణలు చేశారు. ప్రపంచములోనే మొట్ట మొదటగా ఓపెన్ జైలు సిస్టంను ఆయన ప్రవేశపెట్టారు. దేవాదాయ శాఖలో కూడా ఎన్నో మార్పులు చేశారు. ఏ శాఖలో పని చేసిన ఆ శాఖకు ఆయన వన్నె తెచ్చారు. పేదవాళ్ల కోసం రెసిడెన్షియల్ స్కూల్‌లను ఏర్పాటు చేశారు’ అని అన్నారు. 


అనంతరం బోయిన్‌పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రపంచ వ్యాప్తంగా మాజీ ప్రధాని పుట్టిన రోజు వేడుకలు జరగడం గొప్ప విషయం. విద్యార్థి దశ నుంచే మాజీ ప్రధానిని దగ్గరగా చూశాను. ఆయన తెచ్చిన భూ సంస్కరణ వల్ల.. అభివృద్ధి పథంలో దేశం ముందుకు వెళ్లింది. మాజీ ప్రధాని సేవలను గుర్తించి.. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి’ అన్నారు. 



అంతకుముందు మహేష్ బిగాల మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వాగతం పలికారు. అంతేకాకుండా విదేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు. శతజయంతి ఉత్సవాల ప్రణాళికను వెల్లడించారు. కెనడాలో ఉన్న భారతీయులను సంప్రదించి.. అక్కడ పీవీ మార్గ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ ప్రధానికి భారతరత్న పురస్కారం దక్కడం కోసం ఆయన చేస్తున్న కృషిని వివరించారు. ఆన్‌లైన్‌ పిటిషన్ (https://www.change.org/BharatRatnaforPV) ద్వారా మద్దతు తెలిపి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పురస్కారం దక్కేలా కృషి చేయాలని కోరారు. పీవీ నరసింహారావు.. తీసుకొచ్చిన భూ సంస్కరణల గురించి వివరిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ‘ఆధార్ కార్డు లేని ఎన్నారైలకు భూమి ఉంటే.. పాస్‌పోర్ట్ లాంటి గుర్తింపు పత్రాన్ని ధరణిలో నమోదు చేస్తామంటూ’ కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మహేష్ బిగాల గుర్తు చేశారు. ముఖ్య మంత్రి నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేశారు.


చివరిగా.. పి.వి.ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు గురించి చాలా మందికి తెలియని అనేక విషయాలను వివరించారు. ఈ సందర్భంగా నెల్సన్ మండేలా అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు.. మంచి మనసుతోపాటు గొప్ప మేధస్సు కూడా ఉందన్నారు. ఈ రెండూ చాలా కొద్ది మందిలోనే ఉంటాయన్నారు. కృష్ణ కోమండ్ల, వేణు, సాయి రామకృష్ణ, లలిత్, మధు, కరుణకర్ రావు, వినోద్ తదితరుల అద్వ్యర్యములో ఈ కార్యక్రమం జరిగింది. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని జూమ్‌లో నిర్వహించారు. 


Updated Date - 2020-09-20T23:56:08+05:30 IST