బరిలో సింధు, సైనా

ABN , First Publish Date - 2021-01-19T06:23:51+05:30 IST

గత వారం జరిగిన యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత టాప్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ పేలవ ప్రదర్శన చేశారు. సింధు తొలి రౌండ్‌లోనే ఓడగా.. సైనా ప్రీ కార్టర్స్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది...

బరిలో సింధు, సైనా

  • నేటి నుంచి  టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: గత వారం జరిగిన యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత టాప్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ పేలవ ప్రదర్శన చేశారు. సింధు తొలి రౌండ్‌లోనే ఓడగా.. సైనా ప్రీ కార్టర్స్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 10 నెలల కరోనా బ్రేక్‌ తర్వాత జరిగిన తొలి టోర్నీలో వీరిద్దరితోపాటు కిడాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌ కూడా ఫిట్‌నెస్‌ లేమితో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి జరిగే టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-1000 టోర్నీలో మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా వీరు బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో థాయ్‌ షట్లర్‌ బుసానన్‌ ఆంగ్‌బామ్‌రంగ్‌ఫామ్‌తో ఆరో సీడ్‌ సింధు తలపడనుండగా.. మరో థాయ్‌ స్టార్‌ రచనోక్‌ ఇంటానన్‌తో సైనా అమీతుమీ తేల్చుకోనుంది. వీరిద్దరూ క్వార్టర్స్‌కు చేరితే.. ఒకరితో ఒకరు తలపడే అవకాశం ఉంది. ఇక పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, సౌరభ్‌ వర్మ, సమీర్‌ వర్మ, కశ్యప్‌, హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ బరిలోకి దిగనున్నారు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి, మను అత్రి-సుమీత్‌ రెడ్డి, అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీలు బరిలోకి దిగనున్నాయి.


Updated Date - 2021-01-19T06:23:51+05:30 IST