క్వార్టర్స్‌లో సింధు

ABN , First Publish Date - 2021-10-22T07:44:34+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత పోటీపడుతున్న తొలి టోర్నమెంట్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టైటిల్‌ సాధించే దిశగా దూసుకెళ్తోంది.

క్వార్టర్స్‌లో సింధు

డెన్మార్క్‌ ఓపెన్‌ నుంచి శ్రీకాంత్‌ అవుట్‌

ఓడెన్స్‌: టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత పోటీపడుతున్న తొలి టోర్నమెంట్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టైటిల్‌ సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఈ ఒలింపిక్‌ పతక విజేత సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. గురువారం జరిగిన రెండోరౌండ్లో నాలుగోసీడ్‌ సింధు 21-16, 12-21, 21-15తో థాయ్‌లాండ్‌ షట్లర్‌ బుసానన్‌ ఓంగ్‌బారుంగ్‌పాన్‌పై విజయం సాధించింది. గంటకుపైగా సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో రెండో గేమ్‌ కోల్పోయిన సింధు.. ఆ తర్వాత పుంజుకొని పైచేయి సాధించింది. సెమీస్‌ బెర్త్‌ కోసం కొరియాకు చెందిన ఐదోసీడ్‌ అన్‌ సియోంగ్‌తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో భారత ఏస్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం రెండోరౌండ్లోనే ముగిసింది. టాప్‌సీడ్‌ కెంటో మొమోటా (జపాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21-23, 9-21తో పరాజయం పాలయ్యాడు. ఇక, యువ కెరటం లక్ష్యసేన్‌ 15-21, 7-21తో రెండోసీడ్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ధ్రువ్‌ కపిల ద్వయం 17-21, 21-19, 11-21తో హాంకాంగ్‌ జంట తాంగ్‌ చున్‌ మన్‌-సె యింగ్‌ సుయెట్‌ చేతిలో పోరాడి ఓడింది. పురుషుల డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ కపిల జోడీ 15-21, 21-17, 12-21తో ఇండోనేసియాకు చెందిన 4వ సీడ్‌ ఫజర్‌ అల్ఫియాన్‌-మహ్మద్‌ రియాన్‌ జంట చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.   

Updated Date - 2021-10-22T07:44:34+05:30 IST