Tokyo Olympics: సింధు శుభారంభం.. నిరాశపర్చిన షూటర్లు
ABN , First Publish Date - 2021-07-25T13:51:50+05:30 IST
విశ్వక్రీడలు ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు నిరాశపరిచారు.
టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్-జే తొలి మ్యాచ్లో వరల్డ్ 58వ ర్యాంకర్ ఇజ్రాయెల్కు చెందిన సెనియా పోలికర్పోవాపై అలవోకగా గెలిచింది. వరుస సెట్లలో 21-7, 21-10 తేడాతో సింధు విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల వ్యవధిలోనే సింధు ఈ మ్యాచ్ను ముగించడం విశేషం. తన తరువాతి మ్యాచ్లో సింధు హాంగ్కాంగ్కు చెందిన చెయుంగ్ గాన్తో తలపడనుంది.
మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు నిరాశపరిచారు. మనుబాకర్, యశస్విని ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్ 575 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితం కాగా, యశస్విని 574 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. చివరి షూటర్ 577 పాయింట్లతో ఫైనల్స్కు అర్హత సాధించారు. దీంతో రెండు పాయింట్ల తేడాతో మనుబాకర్ ఫైనల్కు వెళ్లలేకపోయారు.