పెన్షన్ డబ్బు వివాదంలో రాఘవ అనుచరుల జోక్యం
ABN , First Publish Date - 2022-01-14T05:10:16+05:30 IST
తన సమస్యను పోలీసులకు ఫిర్యాదు రూపంలో వివరించినా పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు.
యువకుడిపై దాడి
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
పాల్వంచ రూరల్, జనవరి 13: తన సమస్యను పోలీసులకు ఫిర్యాదు రూపంలో వివరించినా పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన పాల్వంచలో గురువారం జరిగింది. పట్టణ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి చేరుకున్న బాధితుడు అక్కడనున్న సెల్ఫోన్ టవర్ ఎక్కి తనకు న్యాయం కావాలని భీష్మించుకుని కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న పాల్వంచ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడు వానపాముల రాంబాబుతో ఫోన్లో చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తనకు తన తండ్రికి మధ్య పెన్షన్ డబ్బు వివాదంలో రాఘవ అనుచరులు జోక్యం చేసుకుని కొట్టారని బాధితుడు వాపోయాడు. వారు కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడి మూడు నెలల నుంచి ఆసుప్రతిలో చికిత్స పొందానని, ఇటీవల వచ్చి 25 రోజుల క్రితం టౌన్ పోలీస్ స్టేషన్లో తనపై దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.