సుప్రీంకోర్టులో ఉత్కంఠగా సాగిన రఘురామ కేసు విచారణ

ABN , First Publish Date - 2021-05-17T21:32:06+05:30 IST

సుప్రీంకోర్టులో ఉత్కంఠగా సాగిన రఘురామ కేసు విచారణ

సుప్రీంకోర్టులో ఉత్కంఠగా సాగిన రఘురామ కేసు విచారణ

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆర్మీ ఆసుపత్రిలోనే చికిత్స నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు రాత్రిలోపు రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు. రఘురామకృష్ణరాజు వ్యవహరంలో పలు ఆసక్తికరమైన మలుపులు, ట్విస్టులు కొనసాగుతున్నాయి. 


రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్, ఆయనపై కస్టడీలో జరిగిన హింసకు సంబంధించి రెండు వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణరావు దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ గువాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 20వ తేదీకి వాయిదా వేసింది. పోలీస్ కస్టడీలో జరిగిన థర్డ్ డిగ్రీ వ్యవహరంపై సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. తన క్లయింట్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఏపీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించటం అన్యాయమని, దర్యాప్తు అధికారి ఒకరే అయితే న్యాయం ఎలా జరుగుతుందని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజు నడవలేకపోతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


రఘురామకృష్ణరాజును కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రికి తరలించాలని కోరారు. ఎయిమ్స్‌కు తరలించేందుకు తమకు అభ్యంతరంలేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలుపగా, మంగళగిరి ఎయిమ్స్‌లో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సలహాదారులుగా ఉన్నారని, అక్కడ వైద్య పరీక్షలు సాధ్యంకాదని ముకుల్ రోహత్గీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన తరపు న్యాయవాదులతోపాటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు అంగీకరించారు. దీంతో రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని, ముగ్గురు వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆసుపత్రిలోనే ఆయనకు ట్రీట్ మెంట్ అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం కాలాన్ని జ్యుడీషియల్ కస్టడీగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ రోజు సాయంత్రంలోపు రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-05-17T21:32:06+05:30 IST