బిట్ కాయిన్పై రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు!
ABN , First Publish Date - 2021-01-14T22:26:51+05:30 IST
బిట్ కాయిన్ ర్యాలీ విషయమై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ విలువు విపరీతంగా పెరగడాన్ని ఆయన బుడగతో పోల్చారు.
న్యూఢిల్లీ: ఇటీవల దూసుకుపోతున్న బిట్ కాయిన్పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిట్ కాయిన్ విలువ విపరీతంగా పెరగడాన్ని ఆయన బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో క్లాసిక్ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్కు బుధవారం నాడు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి..గత ఏడాది మొదట్లో పది వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ నేడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుంది. వాస్తవంగా దీని వల్ల ఎటువంటి విలువా చేకూరదు. ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కూడా కష్టమే. అయినా కానీ బిట్ కాయిన్ విలువ 40 వేల డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తులో దీని విలువ మరింత పెరుగుతుందని మదుపర్లు నమ్ముతున్నారు కాబట్టే బిట్ కాయిన్పై ఆసక్తి నానాటికీ పెరిగిపోతోంది. ఈ వైఖరి ఓ బుడగ లాంటిది’ అని ఆయన వ్యాఖ్యానించారు.