ఏ1, ఏ2లపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి లేఖ రాశా..: రఘురామ
ABN , First Publish Date - 2021-07-26T19:48:30+05:30 IST
ఏ1, ఏ2లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశానని...
న్యూఢిల్లీ: ఏ1, ఏ2లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ-1 జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ పంపాన్నారు. ఏ-2 పెట్టిన సూట్కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరుపుతున్నారని ఆరోపించారు. ట్విటర్లో విజయసాయిరెడ్డి అవాస్తవాలు ప్రచారం చేశారని, ఆయన పేర్కొన్న అంశాలను లేఖలో వివరించానన్నారు. క్విడ్ప్రోకో, సూట్కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరినట్లు స్పష్టం చేశారు.
తాను విదేశాలకు వెళ్లకుండా పాస్ట్పోర్టు రద్దు చేయాలని అడుగుతున్నారని, మరి 20కి పైగా కేసులున్న విజయసాయిరెడ్డి పాస్పోర్టును ఏం చేయాలని రఘురామ ప్రశ్నించారు. ఏపీ అంశాలపై అందరం కలిసి రాజీనామా చేద్దామని, అందుకు సిద్ధమా? అని ఆయన సవాల్ చేశారు. జగన్ బెయిల్ రద్దు కేసు పలు కారణాలతో మళ్ళీ వాయిదా పడిందన్నారు. ఒకేసారి సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు జ్వరం రావడంపై...తనకు అనుమానాలు లేవన్నారు. అయినా ఒకేసారి జ్వరం ఎలా వచ్చిందని రఘురామ ప్రశ్నించారు.